శాశ్వత సభ్యత్వం: కాంగ్రెస్ కుట్ర చేస్తుంది
లక్నో: కుళ్లు రాజకీయాలు చెయ్యడం కోసం కాంగ్రెస్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే అసహనం అనే అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఆరోపించారు.
గురువారం ఆయన లక్నోలో విలేకరులతో మాట్లాడారు. ఐఖ్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని ఇదే సందర్బంలో గుర్తు చేశారు. అయితే ఆ శాశ్వత సభ్యత్వం రాకుండా కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
అనేక దేశాలు భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదన చేస్తూ మద్దతు ఇస్తున్న సందర్బంలో కాంగ్రెస్ అసహనం అనే పేరుతో సొంత దేశానికి ద్రోహం చేస్తున్నదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తుంటే భయం అవుతున్నదని విచారం వ్యక్తం చేశారు.
మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుల హయాంలో కంటే ఇప్పుడు అసహనం ఎక్కువగా ఉందా అనే విషయం చెప్పాలని షనవాజ్ హుస్సేన్ కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు.
అసహనం విషయంలో పార్లమెంట్ సమావేశాలలో చర్చించడానికి తాము సిద్దంగా ఉన్నామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిన విషయం గుర్తు చేశారు. అయితే టీ కప్పులో తుపాను లాగా ఉన్న చిన్న చిన్న సమస్యలను అసహనం పేరుతో కాంగ్రెస్ భంగపరచలేదని షనవాజ్ హుస్సేన్ చెప్పారు.