ఆర్కేనగర్ బరిలో ఇళయరాజా సోదరుడు: బీజేపీ వ్యూహం పనిచేస్తుందా?
ఆర్కేనగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ను తమ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గంలో సత్తా చాటాలని ఆయా పార్టీలు ఉవ్విళ్లురూతున్నాయి. ఇక్కడ గెలవడం ద్వారా తామే అమ్మకు అసలైన వారసులమని చాటుకోవాలనే ఉద్దేశంలో అటు పన్నీర్ సెల్వం వర్గం, దీప వర్గం శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
మరోవైపు అన్నాడీఎంకె నుంచి బరిలో దిగుతున్న ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ సైతం గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను నిలువరించి తమిళనాడులో పాగా వేసేందుకు అటు బీజేపీ కూడా ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో తొలుత నటి గౌతమి బీజేపీ తరుపున ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ అవకాశం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ కు దక్కడం విశేషం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) శుక్రవారం నాడు ఆయన పేరు ఖరారు చేసింది.
కాగా, గంగై అమరన్(69) 2014లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ తరుపున రాష్ట్ర కల్చరల్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. రిపోర్టులు చెబుతున్న దాని ప్రకారం.. తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందరరాజన్ ఆర్కేనగర్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచారు. అయితే పార్టీ పెద్దల నిర్ణయం మేరకు చివరకు గంగై అమరన్ పేరు ఖరారు చేశారు.
అభ్యర్థి ఎంపిక ఖరారైపోవడంతో ఇక జనంలోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నించనుంది. అయితే ప్రాంతీయ పార్టీల హవాను తట్టుకుని ఇక్కడ బీజేపీ ఎంతవరకు పాగా వేయగలుగుతుందనేది ఏప్రిల్ 12న జరిగే ఉపఎన్నికతో తేలిపోనుంది.