ఎంపీలను కూర్చోనివ్వను: మోడీ, భేటీలో శ్రీవారి ప్రసాదాన్ని పంచారు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో విజయం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో విజయం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు.
అనంతరం అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని పంచిపెట్టారు. గురువారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన మోడీని సన్మానించారు.
ప్రధాని మోడీ వారికి దిశానిర్దేశనం చేశారు. దేశాభివృద్ధి కోసం తాను నిరంతరం పని చేస్తూనే ఉంటానని, అందరూ అలాగే పని చేయాలని మోడీ సూచించారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు దేశ యువత ప్రచారకర్తలు కావాలని పిలుపునిచ్చారు.
తాను పని లేకుండా కూర్చోననీ, ఎంపీలు ఎవ్వరినీ అలా కూర్చోనివ్వనని చెప్పారు. మొబైల్ ఫోన్లు యువత జీవితంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయని, పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా ఎప్పటికప్పుడు చేపడుతున్న పథకాలు, పార్టీ కార్యక్రమాలను తెలుసుకోగల్గుతున్నారని అన్నారు.
2019లో వచ్చే సాధారణ ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పిలుపునిచ్చారు. ఇప్పట్నుంచే సన్నద్ధంకావడం కీలకమన్నారు. దేశ ప్రజలు మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు పలికారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
కాగా, యూపీ ముఖ్యమంత్రి ఎవరో ఖరారు చేశారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. ఆ విషయంపై కంగారు పడాల్సిన అవసరం లేదని, యూపీకి మంచి ముఖ్యమంత్రే వస్తారని చెప్పారు.