రాజీవ్ గాంధీ జాతకం రాయించాలని నెహ్రూ కోరారు... లెటర్ను విడుదల చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీకి కుమారుడు జన్మించగానే... బాబు పూర్తి జాతకాన్ని రాయించాలని అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కోరారని సమాచారం. ఈ మేరకు నెహ్రూ రాసిన లేఖను బీజేపీ విడుదల చేసింది. జ్యోతిష్య విద్యను అభ్యశించడం వృధా అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ లేఖను బయటకు తేవడం గమనార్హం.
1944లో ఆగస్టు 29వ తేదీతో ఉన్న ఈ లేఖను కృష్ణ హుతీసింగ్ అనే వ్యక్తికి నెహ్రూ రాసారు. బిడ్డ పుట్టిన ఖచ్చితమైన సమయాన్ని రికార్డు చేయాలని, పూర్తి జాతకం తయారుచేయాలని కోరారు. ఇదే విధమైన లేఖను ఇందిరా గాంధీకి కూడా ఆయన రాసారని సమాచారం.
ఇటీవల కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని ఓ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళడంపై ప్రతిపక్షాలు లోక్సభలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. జ్యోతిష్యాన్ని నమ్మడం శాస్త్రీయ దృక్పథానికి దూరమని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో, నెహ్రూనే జాతకం కోరాడని బీజేపీ సాక్ష్యం తీసుకువచ్చింది.
వివరాల్లోకి వెళితే ఇటీవల రాజస్థాన్ వెళ్లిన స్మృతి ఇరానీ అక్కడి భిల్వారాలోని ఓ జ్యోతిష్యుడిని కలిశారు. గతంలో టీవీ నటిగా ఉన్నప్పుడు స్మృతి ఆయనను కలిశారు. అప్పుడు ‘నువ్వు మంత్రి అవుతావు' అని చెప్పారట. తర్వాత ఆమె మంత్రి అయ్యారు.
దాంతో ఇప్పుడు మళ్లీ కలిశారు. ఈసారి.. ‘నువ్వు రాష్ట్రపతి అవుతావు' అని సదరు జ్యోతిష్యుడు చెప్పారు. అయితే, కేంద్ర మంత్రిగా ఉండి ఆమె జ్యోతిష్యుడిని కలవడం పెద్ద చర్చనీయాంశం అయింది. ‘‘వ్యక్తిగత జీవితంలో నేను ఏం చేస్తున్నానన్నది ప్రజలకు సంబంధించిన అంశం కాదు. టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికే దీనిని వివాదం చేస్తున్నారు. దీని ద్వారా మీకు డబ్బులు వస్తాయంటే నాకు సంతోషమే'' అని స్మృతి వ్యాఖ్యానించారు.