బీజేపీ అంటే గెలుపు.. ప్రతి రాష్ట్రంలో మన సీఎం ఉండాలి : అమిత్ షా
ప్రతి రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలని, ఆ దిశగా అందరం కృషి చేద్దామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
భువనేశ్వర్: ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో అఖండ విజయం సాధించిన తర్వాత బీజేపీ గెలుపునకే అర్థంగా మారిపోయిందని, ప్రతి రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలని, ఆ దిశగా అందరం కృషి చేద్దామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలను బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వాణీ, అమిత్షా, అరుణ్జైట్లీతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తూర్పు రాష్ట్రాలపై పట్టుసాధించడం, భాజపాను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఓటమిని అంగీకరించలేకే విపక్షాలు ఈవీఎంల పనితీరును శంకిస్తున్నాయని మండిపడ్డారు. పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు.
అండమాన్, కేరళలో పర్యటిస్తా..
పార్టీ కార్యనిర్వాహక సభ్యులు బూత్ స్థాయిల్లో 25 రోజులు ఉండి.. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అండమాన్, కేరళలలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ వరకు 90 రోజులపాటు తాను కూడా పర్యటించనున్నట్టు చెప్పారు.
పార్టీ ఇంకా ఉన్నతస్థాయికి ఎదగాలని, రాజకీయ పరిశీలకుల అంచనాలు తప్పు అని యూపీ ఎన్నికలు రుజువుచేశాయని, బీజేపీ ప్రాంతీయ పార్టీలను కూడా ఓడించగలదనే ఆశాభావాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు.
దాడులు, హత్యా రాజకీయాలకు భయపడం..
కేరళ, త్రిపుర, పశ్చిమ్బంగ రాష్ట్రాల్లో ఎంతోమంది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయనీ, వాటిని శాంతియుతంగా తిప్పికొట్టాలని అమిత్ షా తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్ మాట్లాడుతూ డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ తనను తాను హ్యాకింగ్ ఎక్స్పర్ట్గా అభివర్ణించుకుంటున్నారని, అలాగే కేరళలో జరుగుతున్న హత్యా రాజకీయాలకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్నారు. అసోం, మణిపూర్ మాదిరిగానే ఒడిశాలోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.