బీజేపీ క్లీన్ స్వీప్... శ్రేణుల సంబరాలు, శివసేనకు షాక్
భారతీయ జనతా పార్టీ మరోసారి తన సత్తా చాటుకుంటుంది. థానే జిల్లాలోని మీరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ)కు జరిగిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించింది.
ముంబై: భారతీయ జనతా పార్టీ మరోసారి తన సత్తా చాటుకుంటుంది. థానే జిల్లాలోని మీరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ)కు జరిగిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించింది.
ఒంటరిగానే బరిలోకి దిగిన బీజేపీ మొత్తం 95 స్థానాలకు గాను 61 సీట్లు గెలుచుకుని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. శివసేనను వెనక్కి నెట్టేసింది. బీజేపీ-శివసేన గత ఎన్నికల్లో (2012) కలిసి పోటీ చేయగా, ఈసారి ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీలోకి దిగాయి.
సోమవారంనాడు ఫలితాలు వెలువడటం, బీజేపీ మూడింట రెండువంతులు సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ కార్యకర్తలు సందడి చేశారు.
ఈ ఎన్నికల్లో శివసేన 22 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లతో సరిపెట్టుకుంది. 2012 ఎన్నికల్లో 26 సీట్లతో రెండో పెద్ద పార్టీగా నిలిచిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఈసారి ఖాతా కూడా తెరవలేదు.
బీజేపీ నుంచి గెలిచిన వారిలో ఎంబీఎంసీ మేయర్ గీతా జైన్, లేడీస్ బార్ ఓనర్ గణేష్ షెట్టి ఉన్నారు. ప్రస్తుత మున్సిపాలిటీ ఐదేళ్ల కాలపరిమితి ఈనెల 27తో ముగియనుంది.