బ్లాక్మనీపై కేంద్రం విఫలమైతే మళ్లీ ఉద్యమం: హజారే
న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచుకున్న వ్యక్తుల జాబితాను అత్యున్నత న్యాయ స్ధానం సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించడంపై సామాజిక ఉద్యమ కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైతే మళ్లీ దేశంలో లోక్పాల్పై ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు.
హజరే మాట్లాడుతూ "అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న బ్లాక్ మనీని వెనక్కి తీసుకువస్తామని ప్రధానమంత్రి మోడీ, ఆయన పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. ఇప్పటికి 150 రోజులు గడిచిపోయాయి. కానీ, ఇంతరవకు నిర్ధిష్టమైన చర్య తీసుకోలేదు." అని అన్నారు.
ఇప్పటి వరకు ఎనిమిది మంది పేర్లనే ప్రభుత్వం బయటపెట్టింది. మిగిలిన పేర్లను ఎప్పుడు వెల్లడిస్తారా? అని యావత్ దేశం మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తోందని అన్నా హజారే పేర్కొన్నారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న బ్లాక్ మనీ తిరిగి రప్పిస్తే దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రూ. 15 లక్షలు వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయవచ్చని అన్నారు.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గనుక విఫలమైతే ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 627 మందితో కూడిన నల్లకుబేరుల జాబితాను కేంద్ర ప్రభుత్వం బుధవారం సీల్డ్ కవర్లో సమర్పించిందని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తెలిపారు.
సీల్డ్ కవర్లో కేంద్రం 3 జాజితాలను సమర్పించింది. ఒక జాబితాలో నల్లధనం ఉన్నవారి వివరాలు, రెండో జాబితాలో విదేశాల్లో ఖాతాదారులుగా ఉన్న వారి వివరాలు, మూడో జాబితాలో దర్యాప్తు పురోగతిని కేంద్రం సమర్పించింది.
సీల్డ్ కవర్లోని జాబితాను సిట్ అధ్యక్ష, ఉపాధ్యక్షలే తెరవాలని న్యాయస్ధానం సూచించింది. నవంబర్ లోపు దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించాలని సిట్ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సిట్ దర్యాప్తునకు మార్చి 2015 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చిందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తెలిపారు.
పెద్ద చేపలను వదిలేశారు: అరవింద్ కేజ్రీవాల్
విదేశాల్లో నల్లధనం దాచుకున్న నల్లకుబేరుల విషయంలో పెద్ద చేపలను కేంద్ర ప్రభుత్వం వదిలేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరివింద్ కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం విదేశాల్లో ఖాతాలు ఉన్న 627 మంది పేర్లను మాత్రమే సుప్రీం కోర్టుకి సమర్పిందన్నారు.
సీల్డ్ కవర్లో మూడు జాబితాలుగా కేంద్రం, సుప్రీం కోర్టుకి సమర్పించిన సంగతి తెలిసిందే. కేవలం ఎంపిక చేసిన కొన్ని పేర్లను మాత్రమే లిస్ట్లో కోర్టుకు సమర్పించారని.. పెద్ద పెద్ద చేపలు బయటనే ఉన్నాయని అన్నారు.
బ్లాక్ మనీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో అప్లికేషన్ను దాఖలు చేసారు. ఈ అప్లికేషన్లో తనకు తెలిసిన కొంతమంది నల్లధన కుబేరుల పేర్లను కోర్టుకు తెలియజేశారు.