బ్లూవేల్ గేమ్ ఎఫెక్ట్: గూగుల్, ఫేస్బుక్లకు ఢిల్లీ కోర్టు నోటీసులు
బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఫేస్బుక్, గూగుల్, యాహూ, ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఫేస్బుక్, గూగుల్, యాహూ, ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
బ్లూవేల్ లింకులకు సంబంధించి ఆయా సంస్థలకు తక్షణ ఆదేశాలు ఇవ్వాలంటూ లాయర్ గుర్మీత్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి హరిశంకర్ కూడిన ధర్మాసనం దీనిపై కేంద్రం, ఆయా సంస్థలతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చింది.
చిన్నారుల ప్రాణాలను తీస్తున్న బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్కు సంబంధించిన లింకులు తొలగించాలని ఆయా సంస్థలకు ఇటీవల కేంద్రం సూచించింది.
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏవేం చర్యలు తీసుకున్నారో తెలుపుతూ నివేదిక సమర్పించాలని ఆయా సంస్థలకు హైకోర్టు సూచించింది. ఈ నెల 28లోగా తమ స్పందన తెలపాలని పేర్కొంది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది.