శివసేనకు 84, భాజపాకు 81.. మళ్లీ పొత్తు కుదురుతుందా? బీఎంసీ పీఠమెవరిది??
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు బీఎంసీ పీఠం ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
ముంబై: ప్రతిష్ఠాత్మక బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో శివసేన తన సత్తా చాటింది. చిరకాల మిత్రపక్షం బీజేపీని కాదని ఈసారి ఒంటరిగా పోటీచేసిన ఆ పార్టీ అత్యధిక స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంది.
ముందు కాస్త జోరు తగ్గినట్లు కనిపించిన బీజేపీ చివరికి శివసేన కంటే కొద్దిగా వెనకబడి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి దెబ్బే తగిలింది. ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
బీఎంసీలోని మొత్తం 227 వార్డులకుగాను 226 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో శివసేన 84 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 81 స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచింది.
కాంగ్రెస్ పార్టీ కేవలం 31 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఎన్సీపీ అయితే కేవలం 9 స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇక మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) 9 స్థానాల్లో, ఇతరులు 14 స్థానాల్లో గెలుపొందారు. హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు బీఎంసీ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది.
హంగ్ ఏర్పడిన నేపథ్యంలో శివసేన, బీజేపీ మళ్లీ కలుస్తాయా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఇతరులు గెలిచిన 14 స్థానాల్లో మూడు మజ్లిస్ పార్టీకి ఉన్నాయి. మజ్లిస్ తో శివసేన పొత్తు పెట్టుకోదు. కాంగ్రెస్ తో కలిసే సమస్యే లేదు. ఇలాంటి పరిస్థితిలో ఒకప్పటి మిత్రపక్షమైన బీజేపీతో కలిసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.