నిన్న సల్మాన్ ఖాన్: నేడు ఇంకో దోషికి బెయిల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు తరువాత ఇంకొక హిట్ అండ్ రన్ కేసులో దోషికి బెయిల్ మంజూరు అయ్యింది. ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమయిన విస్మయ్ షా అనే వ్యక్తికి సోమవారం సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు అయ్యింది.
గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో నివాసం ఉంటున్న ప్రముఖ కంటి వైద్య నిపుణుడు అమిత్ షా కుమారుడు విస్మయ్ షా. ఇతను 2013 మార్చి నెలలో తన బీఎండబ్ల్యూ కారును వేగంగా నడిపాడు. ఆ సందర్బంలో ఇద్దరిని కారుతో డీకొన్నాడు.
తీవ్రగాయాలైన ఇద్దరు మరణించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విస్మయ్ షా ను అరెస్టు చేసి కోర్టు ముందు నిలబెట్టారు. కేసు విచారణ చేసిన న్యాయస్థానం విస్మయ్ షాకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది.
అంతే కాకుండా ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. ఐదు లక్షలు పరిహారం అందివ్వాలని విస్మయ్ షాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విస్మయ్ షా బెయిల్ మంజూరు చెయ్యాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. విస్మయ్ షాకు బెయిల్ మంజూరు అయ్యింది.