ప్రమాణ కార్యక్రమానికి బాంబు బెదిరింపు, 217రోజుల తర్వాత బయటకు జయ
చెన్నై: తమిళనాడులోని చెన్నై చెపాక్ క్యాంపస్లో జరిగే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా మద్రాసు రైల్వే పోలీసులు శుక్రవారం నాడు తెలిపారు.
రైల్వే కంట్రోల్ గదికి గురువారం అర్ధరాత్రి ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై విచారణ చేపట్టారు. అది ఓ మానసిక వికలాంగుడు చేసినట్లుగా తెలిసింది. ఉత్తుత్తి బెదిరింపు అని తెలిశాక పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు, శనివారం జరగనున్న జయలలిత ప్రమాణ స్వీకారానికి చెపాక్ క్యాంపస్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు, గుర్తింపు కార్డులు ఉన్న వారికే లోనికి అనుమతించనున్నట్లు అధికారులు చెప్పారు.
జయలలితతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం
జయలలిత శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆమెతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారి పేర్లను జయలలిత గవర్నర్కు అందజేశారు. జయలలిత 217 రోజుల తర్వాత.. శుక్రవారం బయటకు వచ్చారు. ఆమె గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత తెలిపారు. కాగా, ప్రమాణ స్వీకారానికి తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు.