టీచర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నా: విద్యార్థి
న్యూఢిల్లీ: సాటి విద్యార్థుల ముందు టీచర్ కఠినంగా వ్యవహరించడంతో అవమానం జరిగిందని ఆవేదన చెందిన విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలో జరిగింది. ఆత్మహత్య చేసుకునే ముందు అతను సూసైడ్ నోట్ వ్రాసి పెట్టాడని పోలీసులు అన్నారు.
ఢిల్లీలోని ఘాజిపూర్ ప్రాంతంలోని ఓ స్కూల్ లో తరుణ్ (16) అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. ఇతను శనివారం స్కూల్ కు మొబైల్ తీసుకు వెళ్లాడు. తరువాత తరుణ్ దగ్గర మొబైల్ ఉన్న విషయం టీచర్ కు తెలిసింది.
వెంటనే టీచర్ కఠినంగా వ్యవహరించి తరుణ్ దగ్గర ఉన్న మొబైల్ లాగేసుకుంది. ఇక మీదట తాను స్కూల్ కు మొబైల్ తీసుకురానని తరుణ్ టీచర్ దగ్గర వేడుకున్నాడు. మొబైల్ ఇవ్వాలని బ్రతిమలాడుకున్నాడు.
మీ కుటుంబ సభ్యులను పిలుచుకుని వస్తేనే తాను మొబైల్ ఇస్తానని లేదంటే ఇవ్వనని ఆ టీచర్ తెగేసి చెప్పింది. సాటి విద్యార్థులు గేలి చూస్తూ తరుణ్ ను చూసి నవ్వుకున్నారు. తరుణ్ చాల అవమానంగా భావించాడు.
ఆదివారం సాయంత్రం తరుణ్ కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. ఆ సమయంలో తన ఆత్మహత్యకు తమ టీచర్ కారణమని, ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్ వ్రాసిన తరుణ్ ఇంటిలో ఉరి వేసుకున్నాడు.
ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.