కాశ్మీర్లో విద్యార్థుల ముందే అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం యుద్ద వాతావరణం కనిపించింది! ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు తోసుకోవడం, ఒకరి పైన మరొకరు చేయి చేసుకోవడం చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. విద్యుత్ ప్రాజెక్టుల పైన చర్చ సందర్భంగా హింసాత్మక సంఘటన జరిగింది.
అధికార పీడీపీ, ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విపక్ష సభ్యులు సభాపతి పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా వారిని అడ్డుకునేందుకు అధికారపక్ష సభ్యులు ప్రయత్నించారు. విద్యుత్ ప్రాజక్టులను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తేవడంలో పీడీపీ, బీజేపీ సర్కారు విఫలమైందని నేషన్ కాన్ఫరెన్స్ ఆరోపించింది.
సభలోనే ధర్నాకు దిగింది. కాగా, దీనిని కొందరు విద్యార్థులు విజిటర్స్ గ్యాలరీ నుండి చూశారు. ఎమ్మెల్యేలు మార్షల్స్ను కూడా తోసేశారు. ఈ ఘటనలో ఓ భద్రతా సిబ్బంది అధికారికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. అయినప్పటికీ పలువురు మార్షల్స్ ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అసెంబ్లీ సమావేశాలు చూసేందుకు వచ్చిన విద్యార్థులు సభలో ఇలాంటి సంఘటనలు చూడటం దురదృష్టకరమని, దురదడష్టవశాత్తూ వారు అసెంబ్లీ పైన నెగిటివ్ ఫీలింగ్తో వెళ్లవలసి వస్తోందని పీడీపీ నేత నయీమ్ అక్తర్ అన్నారు. విద్యార్థులు సదుద్దేశ్యంతో వెళ్తారని తాను మాత్రం భావించడం లేదన్నారు.