వధువు పరారీ, అదే మండపంలో మరో యువతితో పెళ్లి
బెంగళూరు: పెళ్లి జరిగే కొన్ని గంటల ముందు పెళ్లి కుమార్తె మాయం కావడం మనం తెలుగు సినిమాలలో చూసే ఉంటాం. అచ్చం అదే తరహాలో పెళ్లి కుమార్తె నిజంగా పారిపోయింది. మూడు గంటలలో తాళి కట్టించుకొవలసిన పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి హ్యాండ్ ఇచ్చి కళ్యాణమంటపం నుండి పారిపోయిన సంఘట బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని లగ్గేరికి చెందిన యువతికి, తుమకూరు జిల్ల కుణిగల్ పట్టణానికి చెందిన రామచంద్ర అనే యువకుడి వివాహం ఈ నెల 27వ తేది జరిపించాలని పెద్దలు నిశ్చయించారు.
బెంగళూరులోని సుకందకట్ట రోడ్డులో ఉన్న విజయచంద్ర కళ్యాణమంటపంలో బుధవారం రాత్రి వైభవంగా వివాహ రిసెప్షన్ జరిగింది. రాత్రి 12 గంటల వరకు రిసెప్సన్లో బంధువు పాల్గోన్నారు. పెళ్లి కుమార్తె సంతోషంగా శుభకార్యానికి వచ్చిన వారితో ఫోటోలకు ఫోజు ఇచ్చింది. అందరిని నవ్వుతూ పలకరించింది. రిసెప్షన్ పూర్తి అయిన తరువాత తను గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటానని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు చెప్పింది.
పెళ్లి కుమార్తెను ఆమె తల్లి కళ్యాణ మంటపంలోని గదిలోకి పంపించారు. పెళ్లి కుమార్తె బంగారు నగలు మొత్తం తీసి గదిలో పెట్టింది. గుట్టు చప్పుడు కాకుండ కళ్యాణ మండపం నుండి జారుకుంది. గురువారం వేకువజామున సాంప్రదాయం ప్రకారం నలుగు పెట్టటానికి పెళ్లి కుమార్తెను పిలుచుకురావడానికి గదిలోకి వెళ్లారు. అంతే పెళ్లి కుమార్తె కనపడలేదు. కళ్యాణ మంటపం మొత్తం గాలించారు. అంతే పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ తిన్నారు.
ఇరు వర్గాల వారు వాదించుకొవడంతో రచ్చకెక్కింది. విషయం తెలుసుకున్న కామాక్షిపాళ్య పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారికి నచ్చ చెప్పారు. పెద్దలు రాజీ కుదిర్చారు. దూరపు బంధువు అయిన యువతిని వివాహం చేసుకొవడానికి పెళ్లి కుమారుడు రామచంద్రను అతని కుటుంబ సభ్యులు ఒప్పించారు. అదే ముహూర్తానికి అదే కళ్యాణ మంటపంలో పెళ్లి కుమారుడు రామచంద్ర వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం మాయం అయిన పెళ్లి కుమార్తె.. తన తల్లికి ఫోన్ చేసి తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొవడానికి వెళ్లినట్లు సమాచారం ఇచ్చింది.