అధికారం వదిలేయాలంటే, సంక్షోభానికి అందులో సమాధానాలు: మోడీ
న్యూఢిల్లీ: ధనం, అధికారం సహా సర్వం వదులుకోవాలంటే ఎంతో ధైర్యం, నిబద్ధత కావాలని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో ఢిల్లీలోని తల్కతోరా మైదానంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సర్వం వదులుకొని బుద్ధుడు ఆదర్శంగా నిలిచాడన్నారు.
బుద్ధుడు లేకపోతే 21 శతాబ్దం మనది కాదని, ఆయన జన్మించిన కారణంగా 21వ శతాబ్దం ఆసియాది అయిందన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలంటే బుద్ధుని మార్గమే అనుసరణీయమన్నారు. బుద్ధుడు పుట్టిన నేపాల్ ప్రస్తుతం కష్టాల్లో ఉందన్నారు.
నేపాల్ బాధితులకు నివాళులు అర్పించాల్సిన సమయం ఇది అన్నారు. నేపాల్ ప్రజలు ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని ఆశిస్తున్నానని చెప్పారు. బుద్దుడు పుట్టిన నేపాల్ను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు.
ప్రపంచంలోని పలు సంక్షోభాలకు బౌద్ధంలో ఉందని చెప్పారు. ప్రపంచం ఒక్కటిగా ఉండాలని బుద్ధుడు ఆశించాడన్నారు. ప్రపంచం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని, బుద్ధుని బోధనల్లో వాటికి సమాధానాలు ఉన్నాయని చెప్పారు.
బుద్ధుడు మార్పును కోరుకున్నారన్నారు. మహిళా సాధికారత, పీడిత, బలహీన వర్గాల వారి వైపు ఆయన ఉన్నారన్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుకునే సమస్యల పైన బుద్ధుడు 2500 ఏళ్ల క్రితమే చెప్పారన్నారు. అతను భవిష్యత్తు పరిణామాలను కూడా చెప్పారన్నారు.
తెలంగాణలోను బుద్ధుడు పర్యటించాడు: స్వామిగౌడ్
తెలంగాణ ప్రాంతంలో కూడా బుద్ధుడు పర్యటించాడని, బోధనలు చేశారని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బౌద్ద మత సిద్ధాంతాలకు కేంద్రం చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు బుద్ధుడి విధానాలను అనుసరించాలన్నారు.