‘ప్రజాధనం వృథా చేస్తారా? సిగ్గుపడండి’: యుపిలో ఐఏఎస్ చంద్రకళ
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా మేజిస్ట్రేట్గా విధులు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి బి చంద్రకళ నీతి, నిజాయితీలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అవినీతి, అక్రమార్కులకు పాల్పడే అధికారులు, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపుతూ నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్నారు.
రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లను స్కూల్ పిల్లల్లా వరుసలో నిలబెట్టి మరీ క్లాస్ తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో ఇప్పటి వరకూ 6లక్షల మంది వీక్షించారు. దీంతో ఆమె ఒక్కసారిగా జాతీయస్థాయి వార్తల్లో నిలిచారు.
బుధవారం ఆమె బులంద్షహర్ జిల్లాలో పలు రహదారుల పనుల తీరును ఆమె పరిశీలించారు. నాసిరకంగా రోడ్ల పనులను చేపట్టినట్లు ఆమె ఈ సందర్భంగా గుర్తించారు. దీంతో జూనియర్ ఇంజినీర్లు, మున్సిపల్ అధికారులు, ఇతర సిబ్బందితోపాటు కాంట్రాక్టర్లపైనా ప్రజల సమక్షంలోనే ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై విచారణకు ఆదేశించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక 17 కాంట్రాక్ట్లను రద్దు చేశారు.
‘మీరు చేసే పని ఇదేనా? మీరు జైలుకు వెళ్లడం ఖాయం. మీలో కొద్దిగైనా నైతికత అనేది ఉందా? ప్రజాధనం ఎలా వృథా చేస్తారు? మీరు సిగ్గుతో తలదించుకోవాలి' అని అధికారులు, కాంట్రాక్టర్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యుపి కేడర్కు చెందిన చంద్రకళ గతంలో మథుర కలెక్టర్గా పని చేశారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో అక్కడి ప్రజలు ఆమెపై అభిమానం పెంచుకున్నారు. కాగా, ఈ మధ్య బులంద్షహర్కు బదిలీ కావడంతో మథుర జిల్లా ప్రజలు నిరాశకు గురయ్యారు.
కాగా, గిరిజన తెగకు చెందిన బుక్యా చంద్రకళ స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండం. పాఠశాల విద్యను ఆమె రామగుండంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత డిగ్రీ, పీజీలను హైదరాబాద్లో పూర్తి చేశారు. 2008లో సివిల్స్ పరీక్షల్లో 409వ ర్యాంకు సాధించారు. ఆమె భర్త రాములు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. చంద్రకల దంపతులకు ఓ కుమార్తె(9) ఉంది.