కాలువలో పాత రూ. 500, 1000 కరెన్సీ నోట్ల సంచులు
తమిళనాడులోని వానియంబాడి సమీపంలో పాత రూ.500, 1000 కరెన్సీ నోట్లను చించి వేసిన బస్తాలు రోడ్డు పక్కన పడేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
చెన్నై: తమిళనాడులోని వానియంబాడి సమీపంలో పాత రూ.500, 1000 కరెన్సీ నోట్లను చించి వేసిన బస్తాలు రోడ్డు పక్కన పడేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. వేలూరు జిల్లా వానియంబాడిలో ఫర్నీచర్స్, సిమెంట్ రేకులు విక్రయించే దుకాణం ఉంది.
సేలం నుంచి సిమెంట్ రేకులను ఓ లారీలో ఇక్కడికి తీసుకొచ్చారు. వాటిని కిందికి దించే సమయంలో అవి దెబ్బతినకుండా ఉండేందుకు వాటి కింద కొన్ని సంచులను ఉంచారు.
రేకులు దించిన తరువాత ఆ సంచులను ఆ ప్రాంతంలోని రోడ్డు పక్కనున్న కాలువలో పడేశారు. శనివారం ఆ దారిన వెళ్తున్న కొందరు సంచులను పరిశీలనగా చూడగా వాటిలో చించివేసిన రూ.500, 1000 నోట్లు కనిపించాయి.
ఈ విషయాన్ని వానియంబాడి తాలూకా పోలీసులకు తెలుపగా, ఇన్ స్పెక్టర్ కాశీ అక్కడికి చేరుకుని బస్తాల్లో ఉన్న నోట్ల కాగితాలను పరిశీలించారు. చించి వేసిన నోట్ల విలువ పెద్ద మొత్తంలోనే ఉండొచ్చని అంచనా. పాతనోట్లు రద్దు చేసిన నేపథ్యంలో లెక్కలు చూపించలేని వాళ్లెవరో ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.