27న ఉపఎన్నిక: జయలలిత పైన నటి ఖుష్బూ పోటీ?
చెన్నై: చెన్నైలోని డాక్టర్ రాధాకృష్ణ నగర్ (ఆరకే నగర్) శాసన సభ స్థానానికి జూన్ 27వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. 27న ఉప ఎన్నికలు జరగనున్నట్లు మంగళవారం నాటు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక్కడి నుండి అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేయనున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ముఖ్యమంత్రి పదవిని, శ్రీరంగం శాసన సభ స్థానం ప్రాతినిథ్యాన్ని గతంలో జయలలిత కోల్పోయారు. అనంతరం హైకోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆమెను కోర్టు నిర్దోషిగా చెప్పింది.
దీంతో ఆమె తిరిగి ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆమె ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమ్మ కోసం ఆర్కే నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వెట్రివేలు ఇటీవలే రాజీనామా చేశారు.
దీంతో, ఆమె అదే స్థానం నుండి పోటీ చేయనున్నారు. ఇదిలా ఉండగా, జయలలిత పైన ఎవరిని పోటీలో పెట్టాలని డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా సినీ నటి, పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూను పోటీకి దింపవచ్చునని ప్రచారం సాగుతోంది. డీఎంకో కూడా దీటైన అభ్యర్థి కోసం వెతుకుతోంది.