తల్లి గెంటెస్తే! అనుప్రియను కేంద్రమంత్రిని చేసిన మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 35 ఏళ్ల అనుప్రియ సింగ్ పటేల్ ఒకరు. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తొలిసారి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనుప్రియ పటేల్.. ఒకప్పుడు తన పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన నాయకురాలు. అది కూడా వాళ్ల అమ్మ చేతిలోనే కావడం గమనార్హం.
విస్తరణ: ప్రధాని మోడీ స్ట్రాటజీ, కొత్త మంత్రులు వీరే..
ఉత్తరప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ మిత్ర పార్టీ అయిన అప్నాదళ్ నుంచి అనుప్రియ కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్నాదళ్ పార్టీని బిజెపిలో విలీనం చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే అనుప్రియ గత సంవత్సరం తమ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. అప్నాదళ్ వ్యవస్థాపకుడు, అనుప్రియ తండ్రి సోనే లాల్ 2009లో మృతిచెందారు. దీంతో ఆమె తల్లి కృష్ణ పటేల్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి తల్లీకూతుళ్ల మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అనుప్రియను ఆమె తల్లి సస్పెండ్ చేశారు. అంతేగాక, ఆమెను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించారు. అయితే అనుప్రియ సస్పెన్షన్ను ఆమె మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు.
అనుప్రియ నిజమైన అప్నాదళ్ ప్రతినిధి అని, ఆమెను ఎవరూ బహిష్కరించలేరన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన అనుప్రియ పటేల్.. ఇప్పుడు కేంద్రమంత్రిగా నియమితురాలవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఆమెకు బలమైన అనుచర వర్గం ఉండటం తమ పార్టీకి కలిసివచ్చే అంశంగా బిజెపి భావిస్తోంది. అందుకే, అనుప్రియకు మంత్రి పదవి ఇస్తే బిజెపితో తెగదెంబపులు చేసుకుంటానని ఆమె తల్లి, అప్నాదళ్ అధినేత్రి హెచ్చరించినప్పటికీ పరగణలోకి తీసుకోలేదు బిజెపి.
ఇది ఇలా ఉండగా, అనుప్రియ పటేల్.. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎల్ఎస్ఆర్ కాలేజీ నుంచి సైకోలజీ గ్రాడ్యూయేట్ చేశారు. అంతేగాక, ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 2014లో ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంటులో పలుమార్లు ఆమె చేసిన ప్రసంగాలకు సభ్యుల నుంచి అభినందనలు లభించాయి. కాగా, అప్నా దళ్ నుంచి మరో పార్లమెంటు సభ్యుడు హరిబన్ష్ సింగ్. ఈయన అనుప్రియ తల్లికి విశ్వాసపాత్రుడు.