ఏటీఎం 'క్యూ' మీదకు దూసుకెళ్లిన కారు: ముగ్గురికి సీరియస్..
మహారాష్ట్రలోని షోలాపూర్ లో.. ఓ ఏటీఎం ముందు భారీ జనసందోహం బారులు తీరి ఉండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని నేరుగా ఢీకొట్టింది.
షోలాపూర్: దేశంలో కరెన్సీ కష్టాలు సామాన్యులను అల్లాడిస్తున్నాయి. ఎక్కడ చూసినా.. చాంతాడంతా 'క్యూ'లు దర్శనమిస్తుండడంతో.. పనులను సైతం పక్కనబెట్టి గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. అంతసేపు వేచియున్నా!.. నగదు చేతికందుతున్న భరోసా లేకుండా పోయింది.
ఇవన్నీ పక్కనబెడితే.. క్యూ లైన్లలో ఘర్షణలు.. పోలీసుల లాఠీ చార్జీలు, ఓపిక నశించి ఖాతాదారులు బ్యాంకు అద్దాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని షోలాపూర్ లో.. ఓ ఏటీఎం ముందు భారీ జనసందోహం బారులు తీరి ఉండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని నేరుగా ఢీకొట్టింది.
దీంతో క్యూ లైన్లలో నిలబడి వున్న 15మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీ కష్టాల నేపథ్యంలో ఇంకెన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.