విదేశీ గడ్డపై వివాదాస్పద వ్యాఖ్యలు: ప్రధాని మోడీపై కేసు నమోదు
కాన్పూర్: ప్రధాని నరేంద్ర మోడీపై ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కేసు నమోదైంది. మోడీ ఇటీవల దక్షిణకొరియాలో పర్యటించిన సమయంలో ఆయన భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని ఆర్టీఐ కార్యకర్త సందీప్ శుక్లా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
మోడీ చేసిన వ్యాఖ్యలను తాను టీవీలో చూశానని ఆయన పేర్కొన్నారు. ఆ మాటలు తనను ఎంతో బాధించాయని, మోడీ వ్యాఖ్యల తాలూకు సీడీని కూడా న్యాయస్థానానికి శుక్లా అందజేశారు. మోడీపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
దీంతో కోర్టు ప్రధాని మోడీపై కేసు నమోదు చేయాల్సిందిగా కాన్పూర్ పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు ప్రధానిపై కేసు నమోదు చేశారు. కేసుపై జూన్ 10న కోర్టు విచారణ జరపనుంది.
కాగా, ఇంతకుముందు, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎన్నారైలు తాము భారతీయులమని చెప్పుకునేందుకు సిగ్గుపడేవారని, తాము అధికారం చేపట్టాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.