షీనా హత్య: పీటర్కు లై డిటెక్షన్ పరీక్షకు అనుమతి
ముంబై: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియాకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించేందుకు సిబిఐ అధికారులకు శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.
ఆయనకు నవంబర్ 30న ఈ పరీక్షలు చేసే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పీటర్ ముఖర్జియాను షీనా బోరా హత్య కేసులో గత వారం రోజుల కిందటే సిబిఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఆయనను ఇప్పటికే పలుమార్లు ఈ కేసుకు సంబంధించి కోర్టు అనుమతితో ప్రశ్నించినా సరైన విధంగా సమాధానాలు చెప్పకపోవడంతోపాటు విచారణకు సహకరించని నేపథ్యంలో ఆయనకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన భార్య, షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా జైలులో ఉన్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, రిలియన్స్కు చెందిన ముంబై మెట్రోకు షీనా బోరా పంపిన రాజీనామా పత్రంలో తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేయలేదని, ఇంద్రాణినే తనచే బలవంతంగా ఆ పని చేయించారని ఇంద్రాణి ముఖర్జియా పర్సనల్ సెక్రటరీ కాజల్ శర్మ సిబిఐకి తెలిపారు.
2002-07 వరకు ఇంద్రాణితోపాటు కాజల్ ఐఎన్ఎక్స్ కంపెనీలో పని చేసింది. ఆ తర్వాత 2011 నుంచి కాజల్.. ఇంద్రాణి పర్సనల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. మే 2012లో ఇంద్రాణి ఆదేశాల మేరకు తాను షీనా బోరా సంతకాన్ని ఫోర్జరీ చేసి షీనా బోరా తరపున రిలియన్స్కు రాజీనామా లేఖను పంపినట్లు కాజల్ పేర్కొంది.
కాగా, తాను ఎప్పుడూ తన కూతురుతో మాట్లాడుతూ ఉండేవాడనని షీనా బోరా తండ్రి సిద్దార్థ దాస్ తెలిపారు. అయితే 2012, ఏప్రిల్ తర్వాత షీనా ఆచూకీ లేకుండా పోయిందని చెప్పారు. అపట్నుంచి ఆమె నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. చివరిసారిగా 2010, ఆగస్టులో షీనాను ఆమె అమ్మామ్మవాళ్ల ఇంటి వద్ద కలిశానని చెప్పారు.