మారన్ ఇళ్లకు 770 హైకెపాసిటీ డేటా కేబుళ్లు
న్యూఢిల్లీ: డీఎంకే నేత, మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ను సీబీఐ బుధవారం నాడు మరోసారి ప్రశ్నించింది. దయానిధి మారన్ టెలికం మంత్రిగా ఉండగా ఢిల్లీ, చెన్నైలలోని తన నివాసాలకు 770 హైకెపాసిటీ బీఎస్ఎన్ఎల్ డేటా లైన్స్ వేయించుకున్నాడని నిర్ధారించింది.
దీని వల్ల ప్రభుత్వానికి రూ.1.80 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని గుర్తించింది. ఈ కేసులో దయానిధిని అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. గురువారం ఉదయం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారని తెలుస్తోంది.
2014 జనవరిలో ఒకసారి, అక్టోబర్ నెలలో ఒకసారి సీబీఐ అధికారులు దయానిధిని ప్రశ్నించారు. ఆయన సోదరుడు కళానిధి మారన్ను కూడా గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రశ్నించారు. టెలికం మంత్రిగా బీఎస్ఎన్ఎల్ను తన సొంత అవసరాలకు వాడుకోవడంపై సీబీఐ నిశితంగా దర్యాఫ్తు చేస్తోంది.
మారన్ కుటుంబం నడిపే సన్ టీవీ ప్రసారాల కోసమే హైకెపాసిటీ లైన్లను అనధికారికంగా వేయించుకున్నట్లు సీబీఐ గుర్తించిందని తెలుస్తోంది.
మారన్ నివాసానికి వేసింది సాధారణ టెలిఫోన్ వైర్లు కావని, ప్రపంచంలో ఎక్కడికైనా క్షణాల్లో సమాచారం ప్రకారం చేయగల హైకెపాసిటీ కేబుళ్లు అని, వీటిని మారన్ నివాసం నుంచి సన్ టీవీ కార్యాలయానికి అనుసంధానించారని, ఛానల్ ప్రసారాలను వేగంగా ప్రసారం చేసేందుకే ఈ కేబుళ్లను ఉపయోగించుకున్నారని, దయానిధి మారన్ టెలికం మంత్రిగా ఉన్నప్పుడు తన నివాసాన్ని ఒకరకంగా టెలిఫోన్ ఎక్సేంజ్లా వాడుకున్నారని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.