దోపిడీ రాకెట్: ఎంఎల్ఏ ఇంటిపై సీబీఐ దాడి
పాట్నా: బీహార్ కు చెందిన శాసన సభ్యుడి ఇంటిలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అతని ఇంటిలో ఉన్న పలు కీలకమైన డాక్యుమెంట్లు, పత్రాలను పరిశీలించారు. అదే విధంగా ఇంటిలో క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు పలు కోణాలలో విచారణ చేశారు.
బీహార్ కు చెందిన జేడీయూ శాసన సభ్యుడు అనంత్ సింగ్ మీద కిడ్నాప్ లు, పలు హత్యల కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం అనంత్ సింగ్ జైలులో ఉన్నాడు. సీబీఐ అధికారులు అనంత్ సింగ్ ఇంటిలో సోదాలు చెయ్యక ముందు జైలు దగ్గరకు వెళ్లారు.
తరువాత అనంత్ సింగ్ ను ప్రశ్నించడం, ఆ తరువాత నేరుగా పాట్నాలోని ఆయన ఇంటికి చేరుకుని సోదాలు చెయ్యడం ఉత్కంఠకు దారి తీసింది. బీహార్ రాజకీయాలలో వేడి పుట్టించింది. అంతకు ముందు సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహాయం అడిగారు.
సీనియర్ పోలీసు అధికారి వికాస్ వైభవ్ కొందరు పోలీసు అధికారులను సీబీఐ అధికారుల వెంట పంపించారు. అయితే కిడ్నాప్ లు, హత్యల కేసులతో సీబీఐకి సంబంధం లేదు. ఎంఎల్ఏ అనంత్ సింగ్ కాంట్రాక్టులు ఇప్పించే విషయంలో దందాలు చేశాడని వెలుగు చూసింది.
అంతే కాకుండా బీహార్ లో దారి దోపిడీల రాకెట్ నడిపిస్తున్నాడని సీబీఐ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీహార్ లో శక్తివంతమైన భూమి విహార్ వర్గానికి చెందిన అనంత్ సింగ్ మీద పలు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సన్నిహితుడని పేరు ఉంది.