ఐఏఎస్ రవి కేసు: సీబీఐ బృందం బాస్ సెల్వరాజ్
బెంగళూరు: సీబీఐ అధికారులు ఐఏఎస్ అధికారి డి.కే. రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీబీఐ ప్రత్యేక బృందం సీనియర్ అధికారి సెల్వరాజ్ సెంగత్తీర్ ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారు. సెల్వరాజ్ ప్రస్తుతం చెన్నై లో ఉన్నారు. సీబీఐ ప్రత్యేక బృందంలోని అధికారులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు.
చెన్నయ్ నుండి వచ్చిన అధికారులు బెంగళూరు నగరంలోని పలు చోట్ల రవి కేసు విచారణ చేపట్టారు. చెన్నయ్ అధికారులకు బెంగళూరులోని సీబీఐ అధికారులు సహకరిస్తున్నారు. అయితే దర్యాప్తులో బెంగళూరులోని సీబీఐ అధికారుల జోక్యం ఉండదని ఇప్పటికే ఢిల్లీ అధికారులు స్పష్టం చేశారు.
సీబీఐ అధికారులు బెంగళూరులోని సీఐడి అధికారులను సంప్రదించి వారు దర్యాప్తు చేసిన నివేదిక తీసుకున్నారు. బెంగళూరులో దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు చెన్నయ్ లోని సీబీఐ అధికారులకు సమాచారం అందిస్తున్నారు.
ఎలాంటి కేసు అయినా సరే మొదట సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణ చేసి పై అధికారులకు సమాచారం అందిస్తారు. కేసు విచారణ ఒక స్థాయికి వచ్చిన తరువాత సీబీఐ సీనియర్ అధికారులు రంగంలోకి దిగుతారు. మొదటి నుండి ఇది సీబీఐ ఆనవాయితీ.
సీఐడి అధికారుల ఇచ్చిన నివేదిక, రవి ఉపయోగిస్తున్న రెండు మొబైల్ లు, పోస్టుమార్టుం నివేదిక పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విక్టోరియా ఆసుపత్రి చేరుకున్న సీబీఐ అధికారులు రవి మృతదేహానికి ఎవరు పోస్టుమార్టుం నిర్వహించారని డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా బెంగళూరులోని వాణిజ్య పన్నుల విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందిని విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
కేసు ప్రాథమిక విచారణ పూర్తి అయిన తరువాత రవి కుటుంబ సభ్యులను విచారణ చేసే అవకాశం ఉందని తెలిసింది. సీబీఐ అధికారులు ఇద్దరు కోలారులో విచారణ చేస్తున్నారని తెలిసింది. వీలైనంత త్వరగా ఐఏఎస్ అధికారి రవి కేసు దర్యాప్తు పూర్తి చెయ్యాలని సీబీఐ అధికారులు బావిస్తున్నారని తెలిసింది.