ప్రైవేటు స్కూళ్లకు షాక్.. పుస్తకాలు, యూనిఫాం అమ్మరాదన్న సీబీఎస్ఈ
ప్రైవేటు స్కూళ్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ షాకిచ్చింది. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాం అమ్మరాదంటూ సీబీఎస్ఈ గుర్తింపు పొందిన 20 వేలకు పైగా పాఠశాలకు తాజాగా సూచించింది.
న్యూఢిల్లీ: పాఠశాలలు విద్యార్థులకు విద్యా బోధన చేయాలే తప్ప, వాణిజ్యపరమైన కార్యకలాపాలు చేసే కేంద్రాలు కాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
ప్రైవేటు స్కూళ్లలో యూనిఫాం, టెక్ట్స్ పుస్తకాలు, నోటుపుస్తకాలు, ఇతర స్టేషనరీ సామగ్రి అమ్మడాన్ని తక్షణమే నిలిపివేయాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ మేరకు దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ గుర్తింపు పొందిన 20 వేలకు పైగా పాఠశాలకు సూచనలు పంపుతూ, విద్యా కేంద్రాల్లో వ్యాపారం వద్దని ఆదేశించింది. ఈ ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకునే పాఠశాలలపై తగిన చర్యలుంటాయని ఆ సూచనల్లో పేర్కొంది.
సీబీఎస్ఈ లేదా ప్రభుత్వ రంగ ఎన్సీఈఆర్టీ సిఫార్సు చేయని పలు పుస్తకాలు కొనుగోలు చేయాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని, వీటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.