అన్నాడీఎంకే చిచ్చులో మా పాత్ర లేదు: జోక్యం చేసుకోమన్న వెంకయ్య
అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో కేంద్రం ఏమీ లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వాన్నే కేంద్రం కోరుకుంటోందని ఆయన చెప్పారు.
గౌహతి: అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో కేంద్రం ఏమీ లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వాన్నే కేంద్రం కోరుకుంటోందని ఆయన చెప్పారు. మంగళవారం గువాహటిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం అధికార అన్నాడీఎంకే పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత అస్థిరత్వంలో కేంద్రానికి గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ ఎలాంటి ప్రమేయం లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఎంతో అసాధారణమైతే తప్పిస్తే రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని తెలిపారు.
జోక్యం చేసుకోం
‘తమిళనాడులో ప్రజలు అమ్మ (జయలలిత)కు ఓటేశారు. దురదృష్టవశాత్తూ ఆమె చనిపోయారు. ప్రజల కోసం పార్టీ తమ విభేదాలను పరిష్కరించుకోవాలి. ప్రతీదానికీ కేంద్రాన్ని నిందించడం విపక్షానికి పరిపాటిగా మారింది. దేశంలో ఏ మూలన ఏం జరిగినా దానికి కేంద్రాన్నే నిందిస్తున్నారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. దానిలో కేంద్రం జోక్యం చేసుకోదు.. తప్పని పరిస్థితి వస్తే తప్ప' అని వెంకయ్య స్పష్టం చేశారు.
పన్నీరు పావులు
ప్రస్తుతం అన్నాడీఎంకేలో రెండుగా చీలిపోయిన వర్గాలు ఒక్కటవుతున్నాయి. అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబాన్ని, దినకరణ్ను బహిష్కరించి మాజీ సీఎం పన్నీరుసెల్వం ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేందుకు పావులు కదుపుతున్నారు.
శశికళకు చెక్
శశికళ కుటుంబాన్ని ప్రభుత్వం, పార్టీ నుంచి దూరం చేయడంతోపాటు తనకు ఆర్థిక శాఖ మంత్రి పదవి కట్టబెట్టాలనే షరతును కూడా పళని స్వామి ముందు పెట్టారు పన్నీరుసెల్వం. కాగా, ప్రస్తుత సీఎం పళని స్వామి కూడా ఇందుకు సుముఖంగానే ఉండటంతో పన్నీరుస్వామి అనుకున్నది నెరవేరెలా ఉంది.
అర్ధరహితం
ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల్లో విపక్షాలు నెగ్గినప్పుడు అవి ఎలాంటి తప్పునూ చూపలేదనీ, ఇప్పుడు మాత్రం రాద్ధాంతం చేస్తున్నాయని వెంకయ్య మండిపడ్డారు. విపక్షాలు వాస్తవాల్ని జీర్ణించుకోలేకపోతున్నాయనీ, వాటి వాదన అర్థరహితమని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీపై ఇలా
కాంగ్రెస్ ఒకప్పుడు జాతీయ పార్టీగా ఉన్నా ఇప్పుడు నామమాత్రంగా మిగిలిందన్నారు. కాంగ్రెస్ పగ్గాలను రాహుల్గాంధీకి అప్పగించడమనేది ఆ పార్టీ అంతర్గత విషయమన్నారు. వారసత్వ రాజకీయాలను విశ్వసించేది ఆ పార్టీ అయితే ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లేది తమ పార్టీ అని వివరించారు.