రామజన్మభూమికి కొద్ది దూరంలో మసీదు: షియా బోర్డుకు కేంద్రం ప్రశంస
న్యూఢిల్లీ/అయోధ్య: రామజన్మభూమికి కొద్ది దూరంలో మసీదు నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టుకు షియా వక్ఫ్ బోర్డ్ సమర్పించిన అఫిడవిట్ను కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఈ మేరకు కేంద్రమంత్రి సంజీవ్ బాల్యన్ కేంద్రం తరపున మీడియాకు తెలియజేశారు.
'షియా బోర్డు జారీ చేసిన అఫిడవిట్ స్వాగత యోగ్యమైనది. ఏళ్ల తరబడి కోర్టులో మగ్గుతున్న ఈ వివాదం సద్దుమణగడంలో వారి అఫిడవిట్ కీలకపాత్ర పోషిస్తుంది' అని సంజీవ్ తెలిపారు.
బాబ్రీ మసీదు షియా ముస్లింలకు చెందినది కాబట్టి ఈ కేసుకు సంబంధించిన ఏ నిర్ణయమైనా తామే తీసుకుంటామని షియా బోర్టు తన అఫిడవిట్లో స్పష్టం చేసింది. కాగా, 1992, డిసెంబర్ 6న రామజన్మ భూమిలో మసీదు నిర్మించారని హిందూ కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. అప్పటినుంచీ ఈ కేసు సుప్రీంకోర్టులోనే ఉంది.
కొద్ది దూరంలో మసీదు: షియా బోర్డు
రామజన్మభూమికి కొద్ది దూరంలో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో మసీదును నిర్మించుకోవచ్చని ఉత్తర్ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రామమందిరం, మసీదు దగ్గరగా ఉంటే మళ్లీ వివాదాలు తలెత్తే అవకాశం ఉందని షియా బోర్డు న్యాయస్థానానికి తెలియజేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా షియా వక్ఫ్ బోర్డు అఫిడవిట్ను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. మసీదు షియా బోర్డు ఆస్తి అని ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు విషయంలో ఇరు వర్గాలు శాంతియుతంగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఆగస్టు 11న జరగనుంది.