ట్యాక్సీ డ్రైవర్ను కొట్టి.. కారు చోరీ యత్నం!
ఓ ట్యాక్సీ డ్రైవర్ ను కొట్టి అతడి కారును చోరీ చేసేందుకు యత్నించిన నలుగురు యువకుల ఉదంతమిది.
చెన్నై: ఓ ట్యాక్సీ డ్రైవర్ ను కొట్టి అతడి కారును చోరీ చేసేందుకు యత్నించిన నలుగురు యువకుల ఉదంతమిది. వీరిలో ఒక విద్యార్థి పోలీసులకు పట్టుబడగా, అతడికి సహకరించిన మిగిలిన ముగ్గురి కోసం వారు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే... శనివారం అర్ధరాత్రి 1.45 ప్రాంతంలో చెన్నైలోని ఫాస్ట్ ట్రాక్ కాల్ ట్యాక్సీ కంపెనీకి ఓ యువకుడు ఫోన్ చేసి, కోవళం నుంచి బీసెంట్ నగర్ కు వెళ్లేందుకు కారు కావాలని అడిగాడు. వారు డ్రైవర్ మురళీ కృష్ణన్(53)కు సమాచారం అందించడంతో అతడు తన కారుతో కోవళం వెళ్ళాడు.
అక్కడ నలుగురు కుర్రాళ్ళు కారెక్కారు. బీసెంట్ నగర్ వెళ్లాలని చెప్పారు. కారు బయలుదేరింది. ఇంజంబాక్కం బెతేల్ నగర్ సమీపంలోకి వచ్చాక "స్నేహితుడితో మాట్లాడి వస్తాం.. కారాపు.." అని వారు చెప్పడంతో డ్రైవర్ మురళీ కృష్ణన్ కారు ఆపాడు.
కాసేపటికి తిరిగొచ్చిన వారు.. వచ్చీ రావడంతోనే డ్రైవర్ పై దాడి చేశారు. ఒకరు అతడు అరవకుండా గొంతు బిగించి పట్టుకోగా మిగిలిన వారు తాళ్ళతో అతడ్ని కట్టి పడేశారు. వారినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన డ్రైవర్ మురళి కాలితో కారు తలుపును బయటికి తన్ని గట్టిగా కేకలు పెట్టాడు.
అదే సమయంలో సాధారణ పెట్రోలింగ్ లో భాగంగా కన్నగినగర్ క్రైం ఇన్ స్పెక్టర్ రవి నేతృత్వంలో పెట్రోలింగ్ వ్యాన్ అటుగా వచ్చింది. పోలీసులను చూడగానే కుర్రాళ్ళు నలుగురు అక్కడ్నించి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి వారిలో ఒక కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో.. అతడి పేరు మహమ్మద్ ఇర్ఫాన్(20) అని, రాయపురానికి చెందిన ఓ కళాశాల విద్యార్థి అని, అతడే కాల్ చేసి ట్యాక్సీని పిలిచాడని తెలిసింది. అతడు... స్నేహితులైన షకీల్ అహ్మద్, నిరోషన్, కళ్యాణ్ లతో కలిసి కాల్ ట్యాక్సీ డ్రైవర్ ను కొట్టి అతడి కారు దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.
తమ సరదాల కోసం కార్లు దొంగిలించి వాటిని విక్రయిస్తున్నట్లు ఇర్ఫాన్ చెప్పాడు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.