టిసిఎస్ టెక్కీపై రేప్, హత్య: ముగ్గురికి జీవిత ఖైదు
చెన్నై: టిసిఎస్ మహిళా టెక్కీ ఉమా మహేశ్వరిపై అత్యాచారం, ఆమె హత్య కేసులో తమిళనాడు రాజధాని చెన్నైలోని చెంగల్పట్టు మహిళా కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. మహేశ్వరిని దోషులు ఎత్తుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశారని కోర్టు నిర్ధారించింది.
ఉమా మహేశ్వరి చెన్నై శివారులోని సిప్కోట్ ఐటి పార్కులోని టిసిఎస్ కార్యాలయంలో పనిచేస్తూ ఉండేది. ముగ్గురు వలస కూలీలు రామ్ మండల్, ఉత్తమ్ మండల్, ఉజ్జల్ మండల్ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ఆమెను అపహరించి, ఆమెపై అత్యాచారం చేసి, చంపేశారు.
తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో మహిళా కోర్టు న్యాయమూర్తి ఆనంది 51 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించారు. 119 ఎగ్జిబిట్స్, 61 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ను పరిశీలించారు. ఈ ఏడాది సిబిసిఐడి పోలీసులకు సవాల్ విసిరిన కీలకమైన కేసుల్లో ఇదొక్కటి. శాస్త్రీయ పద్ధతుల్లో ముందుకు వెళ్లి, దర్యాప్తులో అధికారులు విజయం సాధించారు.
ఉమా మహేశ్వరి ఫిబ్రవరి 13 తేదీ రాత్రి నుంచి కేలంబాకం నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం అందింది. కార్యాలయం నుంచి బయలుదేరిన ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమె శవం ఫిబ్రవరి 22వ తేదీన బయటపడింది. తొలిసారి తమిళనాడు పోలీసులు ఈ కేసులో డ్రోన్ను వాడారు. డ్రోన్, మిట్ రీసెర్చ్ స్కాలర్స్ సాయంతో శవం కోసం గాలించి, పోలీసులు విజయం సాధించారు.