బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్ట్ ప్రారంభం, భారత్ ఆందోళన
బీజింగ్: భారత్ ఆందోళనను బేఖాతరు చేస్తూ బ్రహ్మపుత్ర నది పైన చైనా నిర్మించిన భారీ జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మంగళవారం నుంచి పని చేయడం ప్రారంభించింది. టిబెట్ ప్రాంతంలో 1.5 బిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ డ్యాంతో దిగువన నివసించే వారి ప్రాణాలకు ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
చైనా నిర్మించిన ఈ జల విద్యుత్ ప్రాజెక్టు జామ్ హైడ్రో పవర్ స్టేషన్. ఇది టిబెట్లో అతిపెద్దైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులోని మొత్తం ఆరు యూనిట్లను మంగళవారం నాడు పవర్ గ్రిడ్లకు అనుసంధానించారు.
వీటిని అనుసంధానించినట్లు జామ్ హైడ్రో ప్రాజెక్టు నిర్మించిన.. అతిపెద్ద హైడ్రో పవర్ కాంట్రాక్టర్ అయిన చైనా గెజౌడా గ్రూప్ తెలిపింది. ఈ సంస్థ కేంద్రం వుహాన్లో ఉంది.
కాగా, ఈ జామ్ హైడ్రో పవర్ స్టేషన్ గ్యాకా కౌంటీలో ఉంది. టిబెట్లో యార్లాంగ్ జాంగ్బో నదిగా పిలిచే బ్రహ్మపుత్ర టిబెట్, భారత్ మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుగా పేరొందిన ఈ ప్రాజెక్టు ఏడాదికి 2.5 బిలియన్ కిలోవాట్ హవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.
ఈ ప్రాజెక్టు పైన భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంక్షోభం సమయంలో ఆ డ్యాం నుంచి ఒకేసారి నీరు విడుదల చేస్తే దిగువ ప్రాంతాలలో వరదముప్పు తలెత్తే అవకాశముందని చెబుతోంది.
సెంట్రల్ టిబెట్లో ఈ ప్రాజెక్టు వల్ల విద్యుత్కు ఇది ఉపశమనం కలుగుతుందని, విద్యుత్ సాధికారత ప్రాంతంగా మారుతుందని, సెంట్రల్ టిబెట్కు చాలా ముఖ్యమైనదని ప్రాజెక్టు నిర్మాణ సంస్థ చెబుతోంది.
ఈ ప్రాజెక్టును టిబెట్ రాజధాని లాషాకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టుకు 1.5 బిలియన్ డాలర్లు అయ్యాయి. మొదటి యూనిట్ గత ఏడాది నవంబర్ నెలలో ప్రారంభమైంది.