'సీఎం' పార్కింగ్ స్థలంలో కారు పెట్టట్లేదు: కరుణ చురక
చెన్నై: డీఎంకే పార్టీ అధ్యక్షులు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు తనదైన శైలిలో చురకలు అంటించారు. అసెంబ్లీ సమావేశాలకు కరుణానిధి సరిగా హాజరుకావడం లేదని పన్నీర్ సెల్వం ఇటీవలే వ్యాఖ్యానించారు. దీనికి కరుణ ఆదివారం స్పందించారు.
సభలో మెరుగైన సీటింగ్ అమరిక ఏర్పాటు చేస్తే, తాను సభకు వస్తానని సమాధానమిచ్చారు. తనకు సరైన సీటింగ్ అమరిక లేకుండా సభకు హాజరు కాలేనని 2013లో ప్రభుత్వానికి సమాచారం అందించానని, ఈ ఏడాది కూడా సర్కారుకు తెలిపానని చెప్పారు. అయినా సర్కారు తన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సమయంలో పన్నీరు సెల్వంకు చురకలు అంటించారు. అతను ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రభుత్వాన్ని నడిపేందుకు ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. తన కారును ముఖ్యమంత్రికి కేటాయించిన పార్కింగ్ స్థలంలో ఉంచడం లేదని ఎద్దేవా చేశారు.
అన్నాడీఎంకే అధినేత్రి స్థానంలో కూర్చుండెందుకు పెనుగులాడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత విపక్ష సభ్యురాలిగా ఉన్న సమయంలో డీఎంకే ఎమ్మెల్యేలు, తమ ప్రభుత్వం ఆమె చెప్పిన దానిని పూర్తిగా వినేవాళ్లమని కరుణానిధి అన్నారు.
ఇప్పుడు అన్నాడీఎంకే సభ్యులు కూడా అలాగే తాము చెప్పేది వింటారని ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం హామీ ఇస్తే తాను తప్పకుండా సభకు హాజరవుతానని చెప్పారు. కాగా, తమిళ జాలర్ల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లి, సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కరుణానిధి ముఖ్యమంత్రికి సోమవారం సూచించారు.