ఆ 60 మందులు నాసిరకం.. పరీక్షించాకే చెబుతున్నాం: హెచ్చరించిన సీడీఎస్సీవో
నొప్పుల నివారణకు సాధారణంగా వాడే మందులు నాసిరకంగా తయారవుతున్నట్టు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ (సీడీఎస్సీవో) జరిపిన పరీక్షలో వెల్లడైంది.
న్యూఢిల్లీ: నొప్పుల నివారణకు సాధారణంగా వాడే మందులు నాసిరకంగా తయారవుతున్నట్టు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ (సీడీఎస్సీవో) జరిపిన పరీక్షలో వెల్లడైంది.
గత నెలలో తాము నిర్వహించిన పరీక్షలో కాంబిఫ్లామ్, డీకోల్డ్ టోటల్, ఓఫ్లాక్స్-100 డీటీ, థియో ఆస్థలిన్ ట్యాబ్లెట్లు కెడిలోస్ సొల్యూషన్ నాసికరమైనవని నిర్ధారించింది. వీటితోపాటు మరో 55 మందుల వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
నొప్పుల నివారణకు వాడే కాంబిఫ్లామ్, జలుబు నుంచి ఉపశమనం పొందేందుకు వినియోగించే డీకోల్డ్ టోటల్, యాంటి బయాటిక్ ఓఫ్లాక్స్-100 డీటీ ట్యాబెట్లు, శ్వాస సంబంధ సమస్యల పరిష్కారానికి వాడే థియో ఆస్థలిన్, మలబద్ధకం నివారణకు వాడే కెడిలోస్ సొల్యూషన్ నాణ్యంగా లేవని సీడీఎస్సీవో వెల్లడించినట్టు ఇండియా టుడే పేర్కొన్నది.
అయితే, ఈ విషయమై సీడీఎస్సీవో నుంచి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని, వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని కాంబిఫ్లామ్ను తయారుచేస్తున్న సనోఫీ కంపెనీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. తమకు ఇప్పటివరకు అధికారికంగా సమాచారం అందలేదని కెడిలోస్ సొల్యూషన్ తయారీదారైన కేడిలా ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధి పేర్కొన్నారు.