లింగ మార్పిడికి వెళ్లి.. ప్రేమలో పడ్డారు!
వారిద్దరూ ఒకరికొకరు తెలియదు. వారి ఆసక్తుల మేరకు లింగమార్పిడి చేయించుకోవాలనుకున్నారు. దగ్గర్లోని ఓ క్లినిక్ను ఆశ్రయించారు. అక్కడే వారి ప్రేమకు అంకురార్పణ జరిగింది.
ముంబై: వారిద్దరూ ఒకరికొకరు తెలియదు. వారి ఆసక్తుల మేరకు లింగమార్పిడి చేయించుకోవాలనుకున్నారు. దగ్గర్లోని ఓ క్లినిక్ను ఆశ్రయించారు. అక్కడే వారి ప్రేమకు అంకురార్పణ జరిగింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకునే యోచనలో ఉన్నారు.
వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఆరవ్ అప్పుకుట్టన్ అనే మహిళ, సుకన్య క్రిష్ణ అనే యువకుడు లింగమార్పిడి కోసం మూడు సంవత్సరాల క్రితం దగ్గర్లోని ఓ ప్రైవేటు క్లినిక్లో చేరారు. అక్కడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. లింగ మార్పిడి అనంతరం కూడా వీరి పరిచయం కొనసాగి ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
హిందూ సంప్రదాయంలో రాజ్యాంగబద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పురుషుడిగా మారిన 46 ఏళ్ల అప్పుకుట్టన్ తెలిపారు. తన జీవితాంతం సుకన్య క్రిష్ణన్తో గడపాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే తాము లింగమార్పిడి చేయించుకున్నందున తమ వివాహానికి ప్రభుత్వ అనుమతి కోసం కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపారు.
ఇలాంటి వివాహానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ సమాజంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నట్లు క్రిష్ణ పేర్కొన్నారు. తమకు పిల్లల్ని కనాలని ఉన్నప్పటికీ శారీరక ఇబ్బందుల దృష్ట్యా అది సాధ్యం కాకపోవడంతో ఓ చిన్నారిని దత్తత తీసుకుంటామని వారు తెలిపారు.