సీఐ మిస్ ఫైరింగ్: పోలీసు బలి, ఎస్ఐకి గాయాలు
బెంగళూరు: ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సమయంలో కామాండో (సర్కిల్ ఇన్స్ పెక్టర్) చేతిలోని పిస్తోల్ పేలి పోవడంతో కానిస్టేబుల్ మరణించి, మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ కు తీవ్రగాయాలైన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. గాయాలైన ఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నది.
కర్ణాటకలోని చామరాజనగర కు చెందిన మహదేవస్వామి (30) అనే పోలీసు తూటాకు బలి అయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక దళం టీంలను ఏర్పాటు చేసింది.
ఒక టీంలో ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ (30), ఇండస్ట్రియల్ సెక్యూరిటి ఫోర్స్ కు చెందిన మహిళా ఎస్ఐ మంజుల(27), కానిస్టేబుల్ మహదేవస్వామి, రాజశేఖర్ లను నియమించారు. వీరికి హోసూరు రోడ్డులోని కూడ్లు గేట్ దగ్గర ఉన్న కేఎస్ఆర్ పీ మైదానంలో ప్రతి రోజు శిక్షణ ఇస్తుంటారు.
ఎప్పటిలాగే గురువారం ఉదయం 9.30 గంటలకు వీరు శిక్షణ పొందుతున్నారు. తుపాకులతో గురి చూసి కాల్చుతున్నారు. ఆ సమయంలో ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ తన చేతిలో ఉన్న 9 ఎంఎం పిస్తోల్ నుండి బుల్లెట్ లు బయటకు తియ్యడానికి ప్రయత్నించారు.
అదే సమయంలో ట్రిగర్ నోక్కడంతో బుల్లెట్ లు మహదేవస్వామి శరీరంలోకి, మంజుల వీపులోకి దూసుకు వెళ్లాయి. రక్తపుమడుగులో పడి ఉన్న ఇద్దరిని స్పర్శ్ ఆసుపత్రికి తరలించారు. అయితే రక్తం ఎక్కువ పోవడంతో మహదేవ స్వామి మరణించాడు.
మంజులకు ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటకు తీశారు. హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ ఉద్దేశపూర్వకంగా హత్య చెయ్యలేదని అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఏడీజీపీ అమర్ కుమార్ పాండే తెలిపారు. మరణించిన కానిస్టేబుల్ మహదేవస్వామికి సంవత్సరం క్రితం పెళ్లి జరిగింది. అతని భార్య గర్బిణి.