వచ్చేస్తోంది.. రూ.200 నోటు! విడుదలకు ఆర్బీఐ సన్నాహాలు!
చరిత్రలోనే తొలిసారిగా రూ.200 నోటును ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఈనెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ కొత్త రూ.200 నోటు బయటకు రానుంది.
ముంబై: చరిత్రలోనే తొలిసారిగా రూ.200 నోటును ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). వీలైతే ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ కొత్త రూ.200 నోటు బయటకు రానుంది.
సుమారు 50 కోట్ల రూ.200 నోట్లను ఆర్బీఐ మార్కెట్లోకి తీసుకురానుంది. మార్కెట్లో ఈ నోట్టకు కొరత లేకుండా, బ్లాక్ మార్కెట్కు తరలకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో రూ.100 నుంచి రూ.500 మధ్య ఎలాంటి నోటు లేదు.
అందుకే రూ.200 నోటు మార్కెట్లో బాగా పాపులర్ అవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. అందుకు తగినట్లే వాటి కొరత లేకుండా చూసుకుంటోంది అని ఆర్బీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
భారీగా మార్కెట్లోకి రానున్న ఈ కొత్త రూ.200 నోటు వల్ల ఇప్పటివరకు ఇబ్బందులు పడుతున్న సామాన్య జనం కష్టాలు తీరుతాయని ఎస్బీఐ చీఫ్ ఎకనమిస్ట్ కాంతి ఘోష్ అభిప్రాయపడ్డారు.
హడావిడిగా ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లు బ్లాక్ మార్కెటింగ్ తరలిపోవడం, నకిలీలు రావడంతో ఈ కొత్త రూ.200 నోటు అలాంటి వాటి బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పెద్ద నోట్లు మార్కెట్లో ఎక్కువగా లేకపోతే.. పన్నులు ఎగ్గొట్టి అక్రమంగా దాచుకునే సొమ్ము కూడా తక్కువవుతుందని ఆర్బీఐ భావిస్తున్నది. ఈ రూ.200 నోట్ల వల్ల తక్కువ విలువ ఉన్న నోట్ల కొరత తీరనుంది.
నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో పెద్ద నోట్ల చెలామణి 86 శాతం నుంచి 70 శాతానికి పడిపోయింది. ఈ రూ.200 నోటు వస్తే వాటి వాడకం మరింత తక్కువవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.