హోటల్లో టేబుళ్లు శుభ్రం చేసేది: స్మృతి ఇరానీపై కామత్
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గురుదాస్ కామత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రధాని నరేంద్రమోడీ సొంత ప్రయోజనాల కోసమే ఆమెను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మంత్రిగా నియమించారని వ్యాఖ్యానించారు.
రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యతలను చూస్తున్న ఆయన త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పాలీలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ స్మృతి ఇరానీకి పెద్దగా చదువులేదన్న విషయం తెలిసి కూడా ఆమెవైపే మొగ్గుచూపారని పేర్కొన్నారు.
"ఆమె (ఇరానీ) కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగుండేది కాదు. దాంతో, వెర్సోవాలోని ఓ హోటల్లో పనిచేసింది. ఆమె చదివింది 10వ తరగతి కావడంతో, ఆ హోటల్లో టేబుళ్లు శుభ్రం చేసేది" అని వివరించారు. మోడలింగ్ రంగంలో రాణించక ముందు స్మృతి ఇరానీ మెక్ డోనాల్డ్స్లో వెయిట్రెస్గా పని చేసిందని పేర్కొన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతోనే ప్రధాని మోడీ, స్మృతీ ఇరానీని మంత్రిని చేశారని కామత్ పేర్కొన్నారు. దీంతో పాటు నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'మన్కీ బాత్' ప్రొగ్రాంపై కూడా ధ్వజమెత్తారు.
రైతుల వెతల కంటే ఆయనకు టీవీ సీరియళ్లపైనే ఆసక్తి ఎక్కువని వ్యంగ్యంగా అన్నారు. బీజేపీపై కాంగ్రెస్ నేత కామత్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ నేతల తీవ్ర నిరాశను ప్రతిబింబించే విధంగా ఉన్నాయి.