కర్ణాటక నుంచి జైరామ్ : కాంగ్రెస్ రాజ్యసభ నామినేటర్ల జాబితా ఇదే..
న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేటర్ల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తాజాగా విడుదల చేసిన జాబితా నుంచి కనీసం ముగ్గురికైనా పార్టీ నుంచి రాజ్యసభ ప్రాతినిథ్యం దక్కేలా ప్రయత్నాలు చేస్తోంది. శనివారం కాంగ్రెస్ విడుదల చేసిన జాబితా ప్రకారం కపిల్ సిబల్, వివేక్ తంఖా, పి.చిదరంబరం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
కాగా.. ఈ ముగ్గురిలో కపిల్ సిబల్ ను ఉత్తరప్రదేశ్ లేదా ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉంది. అలాగే వివేక్ తంఖాను మధ్యప్రదేశ్ నుంచి నామినేట్ ను చేస్తుండగా, జైరాం రమేష్ కు మరోసారి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ఈ దఫా ఆయన్ను కర్ణాటక నుంచి బరిలో దించబోతుంది. గత రాజ్యసభ పదవి కాలంలో జైరాం రమేష్ ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ తరుపున మిగిలిపోయే ఓట్లను కాంగ్రెస్ ఖాతాలో వేయడానికి ఆ పార్టీ సుముఖంగా ఉన్నట్టు తెలియజేశారు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే.. ప్లానింగ్ కమిషన్ మెంబర్ గా, ముంబై యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన డాక్డర్ బాలచంద్ర ముంగేకర్ ను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయనుంది కాంగ్రెస్.
ఇక మరో మాజీ కేంద్రమంత్రి విలాస్ ముత్తేమ్వర్ ను కూడా మహారాష్ట్ర నుంచి నామినేట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నా..! పీసీసీ చీఫ్ అశోక్ చవాన్ మాత్రం వేరే రాష్ట్రం వ్యక్తికి మహారాష్ట్ర నుంచి ప్రాతినిథ్యానికి ససేమిరా అంటున్నట్టుగా సమాచారం.
అలాగే ప్రముఖ న్యాయవాది ఆర్కే ఆనంద్ పేరు కూడా రాజ్యసభ నామినేటర్ల రేసులో వినిపిస్తోంది. ఆనంద్ గతంలో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. కాగా ఆనంద్ ని ఛత్తీస్ ఘఢ్ లేదా ఉత్తరాఖండ్ నుంచి నామినేట్ చేసే అవకాశం ఉంది.