ప్రధానిదే తుది మాట: కాంగ్రెస్పై జైట్లీ, జైలుకెళ్లిన లాలూతో పంపిన నితీష్..
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో రెండు అధికార కేంద్రాలు ఉండేవని, ఫలితంగా ప్రధానమంత్రి పదవి స్థాయి తగ్గిపోయిందని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో ప్రధానిదే తుది మాట అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం చెప్పారు. మోడీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వానికి వెలుపల మరో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాని స్థాయిని యూపీఏ ప్రభుత్వం దిగజార్చిందని, ప్రజాస్వామ్యంలో అలాంటివి కుదరదన్నారు. అదే విషయం తాము మొదటి నుండి భావిస్తూ అందుకు అనుగుణంగా పరిస్థితిని మార్చేశామన్నారు.
ప్రధాని కార్యాలయ గౌరవాన్ని పునరుద్ధరించామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో తుది మాట ప్రధానిదే అన్నారు. వ్యవస్థ సాగాల్సింది ఇదే రీతిలో అన్నారు. దేశంలో మైనార్టీలు సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. మతపరమైన ఉద్రిక్తలు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు.
మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి జైట్లీ స్పందిస్తూ.. అవినీతి నిర్మూలన, ప్రపంచంలో భారతస్థాయి పెరగడం, ఇటీవల ప్రకటించిన అనేక సామాజిక భద్రత పథకాలు మంచి రోజులకు సూచనలు అన్నారు.
జనతా పరివార్ సంకీర్ణంపై మాట్లాడుతూ.. అది ఆచరణ సాధ్యం కానిదన్నారు. బీజేపీని ఓడించడం కోసం జైలుకు వెళ్లిన వారు, వారిని జైలుకు పంపిన వారు చేతులు కలిపారని ఎద్దేవా చేశారు. కాగా, ఏకాభిప్రాయం లేకుంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా అసాధ్యమని చెప్పారు.