సోనియా గాంధీకి స్వల్ప అస్వస్ధత... ఆసుపత్రిలో చేరారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం రాత్రి స్వల్ప అస్వస్ధతకు గురయ్యారు. ఆమెకు శ్వాస కోశ సంబంధిత ఇన్ఫెక్షన్ సోకడంతో ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆమెను చికిత్స కోసం వెంటనే ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ తెలిపారు.
గత ఏడాది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సోనియా గాంధీ అవస్ధతకు గురికాగా... రాహుల్ గాంధీ దగ్గరుండి ఆమెను ఎయిమ్స్కి తరలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పార్లమెంట్లో ఆహార భద్రత బిల్లుపై చర్చ జరుగుతోంది.
సోనియా గాంధీ ఆరోగ్య పరిస్ధితిని సీనియర్ కన్సల్టెంట్ అరుప్ కుమార్ బసు సమీక్షిస్తున్నారు. చలికాలంలో ఇలాంటి శ్వాస కోశ సంబంధిత ఇన్ఫెక్షన్ సోకడం సాధారణమేనని డాక్టర్లు తెలిపారు. 2011లో అమెరికాలో సోనియా గాంధీ సర్జరీ చేయించుకున్న తర్వాత అప్పుడప్పుడు అస్వస్ధకు గురవుతున్నారు. 2008లో ఆరు రోజుల పాటు సోనియా గాంధీ ఆస్తమాకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.