ఆర్మీ దాడులు సమర్ధించిన కాంగ్రెస్: పాక్పై యుద్ధం ప్రకటించినట్టే
న్యూఢిల్లీ: ఎల్ఓసీలోని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం నిర్వహించిన దాడులను కాంగ్రెస్ పార్టీ సమర్ధించింది. పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరపడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రశంసిస్తున్నట్లు ఆమె రాజకీయా కార్యదర్శి అహ్మద్ పటేల్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
We congratulate the Indian army for undertaking surgical strikes on terror launch pads.We stand completely behind our Armed Forces
— Ahmed Patel (@ahmedpatel) September 29, 2016
సైన్యం దాడులపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా గురువారం మీడియాతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై సైన్యం దాడులను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తోందన్నారు. ఇండియన్ ఆర్మీ ధైర్యసాహసాలకు గౌరవ వందనం చేస్తున్నామన్నారు.
INC wholeheartedly supports the surgical strike on terror pads in POK by Indian Army. Salute the valour of our armed forces.
— Randeep S Surjewala (@rssurjewala) September 29, 2016
కాగా, బుధవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు 38 వరకు మరణించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు నేపథ్యంలో బోర్డర్లో కేంద్రం ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా కాశ్మీర్లోని విమానాశ్రయాలు, వైమానికి స్థావరాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నేషనల్ బోర్డర్కు ఆనుకుని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ గ్రామాలను బీఎస్ఎఫ్ ఖాళీ చేయిస్తోంది.
కాగా భారత సరిహద్దును దాటి పాక్లోకి ప్రవేశించి భారత సైన్యం దాడులు చేసిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ముస్తఫా కమల్ మీడియాతో మాట్లాడారు. సరిహద్దులను దాటడమంటే యుద్ధం ప్రకటించడమేనన్నారు.
కేంద్రం జమ్మూ కాశ్మీర్ని శాంతి, స్నేహాలకు వారథిగా తీర్చిదిద్దాలని భావిస్తూనే, దురదృష్టవశాత్తూ వేరే దారిలో నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఎల్ఓసీలోని పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి భారత సైన్యం చొచ్చుకుపోయి బుధవారం రాత్రి 12,30 గంటలకు ఆకస్మిక దాడులు చేసిన సంగతి తెలిసిందే.
నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 500 మీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వరకు ఈ దాడులను నిర్వహించింది. తెల్లవారుజాము 4.30 గంటల వరకు దాడులు జరిగాయి. రష్యన్ తయారీ ఎంఐ 17హెలికాప్టర్లో కెల్, లింపా, బిన్బర్ గుండా భారతీయ కమాండోలు చొచ్చుకుపోయి పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశారు.
గంటకు 250 కి.మీ. వేగంతో వెళ్ళినట్లు భారత సైన్యం సుమారు 8 స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ మొత్తం ఆపరేషన్ని రక్షణ మంత్రి పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బుధవారం రాత్రి పూర్తిగా ఆర్మీ హెడ్క్వార్టర్స్లోనే బస చేసి, పర్యవేక్షించారు.