ఉగ్రవాదులనే డౌట్తో పోలీసుపై కాల్పులు
న్యూఢిల్లీ: మద్యం మత్తులో కారు నడిపి గేట్ ను డీకొనడంతో నిత్యం గట్టి సెక్యూరిటి ఉన్న ఆకాశవాణి భవన్ సెక్యూరిటి సిబ్బంది కాల్పులు జరిపిన సంఘటన ఢిల్లీలో జరిగింది. బుల్లెట్ లు దూసుకు వెల్లడంతో కానిస్టేబుల్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
ఢిల్లీ సాయుధ బలగాల బెటాలియన్ లో అంకిత్ కుమార్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇతను ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. తరువాత సోమవారం వేకువ జామున 3.30 గంటల సమయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి మారుతి షిఫ్ట్ కారులో బయలుదేరాడు.
మార్గం మధ్యలో తిమర్ పూర్ ప్రాంతంలో కారు ఇష్టం వచ్చినట్లు నడపడంతో వెళ్లి ఆకాశవాణి కేంద్రం కార్యాలయం మెయిన్ గేట్ ను డీకొంది. అక్కడ విధులలో ఉన్న సెక్యూరిటి సిబ్బంది ఉగ్రవాదులు దాడి చెయ్యడానికి ప్రయత్నించారని అనుకున్నారు.
వెంటనే కారు మీద కాల్పులు జరిపారు. తూటాలు కానిస్టేబుల్ అంకిత్ కుమార్ శరీరంలో దూసుకు వెళ్లాయి. మద్యం మత్తు వదిలిపోవడంతో అంకిత్ స్నేహితులు గట్టిగా కేకలు వేశారు. సెక్యూరిటి గార్డులు దగ్గరకు వచ్చి చూడగా అసలు విషయం వెలుగు చూసింది.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాగాల్యాండ్ కు చెందిన పోలీసులను ఆకాశవాణి కేంద్రం దగ్గర సెక్యూరిటిగార్డులుగా నియమించారని పోలీసు అధికారులు చెప్పారు. అంకిత్ కుమార్ మీద కేసు నమోదు అయ్యిందని పోలీసు అధికారులు తెలిపారు.