భారీగా దొంగనోట్లు: పాక్ నుంచి విశాఖకు, వ్యక్తి అరెస్ట్
కర్నూలు: పాకిస్థాన్ నుంచి భారత్కు భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ దిగుమతి అవుతోంది. పాకిస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు కీలక వ్యక్తుల ద్వారా దిగుమతి అవుతున్న నకిలీ నోట్లు.. అక్కడి నుంచి రైలు మార్గంలో విశాఖపట్నం చేరుకుంటున్నాయి. వైజాగ్ నుంచి ఈ నకిలీ నోట్లను వ్యాపారులకు, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిగే మార్కెట్ యార్డుల్లోనూ చలామణి చేస్తున్నారు.
ఒకే వ్యక్తి గత మూడేళ్లలో 60 లక్షల రూపాయలు విలువచేసే నకిలీ నోట్లను చలామణి చేశాడంటే.. ఎంత పెద్దమొత్తంలో దొంగనోట్లు చలామణిలో ఉన్నాయో గ్రహించవచ్చు. తాజాగా ఇదే వ్యక్తి మూడు లక్షల విలువైన దొంగనోట్లు రవాణాచేస్తూ దొరికిపోయాడు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాకు చెందిన ఇందవాసి వీరేశ్నాయక్ గత కొన్నేళ్లుగా నకిలీ నోట్లు చలామణి చేస్తూ.. పలు కేసుల్లో పట్టుబడ్డాడు.
నాయక్ని బుధవారం కర్నూలు 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.2.99 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్లోని ఖలేచౌక్ గ్రామం నుంచి సుల్తాన్ అనే వ్యక్తి వద్ద ఈ నగదు తెచ్చుకున్నట్లుగా వీరేశ్ తెలిపాడు. ఇతడిపై పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, కలిదిండి, ఏలూరు పోలీసుస్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి.
ఈ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చాడు. గత మూడేళ్లుగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ రూ.60 లక్షల మేర నకిలీ నోట్లు చలామణి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాయచూరు ప్రాంతంలో చలామణి చేసేందుకు వెళ్తూ కర్నూలు పోలీసులకు పట్టుబడ్డాడు.
కాగా నకిలీ నోట్లు చలామణిచేసే నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయిస్తామని జిల్లా ఎస్పీ ఆకెళ్ల రవికృష్ణ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుచేసి కీలక నిందితులందరినీ పట్టుకుంటామని చెప్పారు. దొంగనోట్ల తయారీలో ఎంత ఆధునిక సాంకేతిక పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారంటే... కర్నూలులో నిందితుని వద్ద లభించిన దొంగనోట్లను పోలీసులు, బ్యాంకు అధికారులు కూడా గుర్తించలేకపోయారు.
నకిలీ నోట్లను అసలు నోట్లతో పోలిస్తే గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో... పోలీసులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. బ్యాంకర్లు కూడా తొలుత వాటిని అసలు నోట్లుగానే తేల్చారు. చివరకు మిషన్లోవేసి తనిఖీ చేయటంతో నకిలీవని తేలింది. నోటు మధ్యలో ఉండే సిల్వర్ తీగలో వినియోగించిన రసాయన ద్రవాన్ని మిషన్ వేరుగా చూపించింది.
ముంబైలో వ్యక్తి అరెస్ట్
ముంబై: నకిలీ నోట్లు సరఫార చేస్తున్న ఓ వ్యక్తిని ముంబై పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ముంబైలోని కళ్యాణ్ ప్రాంతంలో నివాసముంటున్న రషీద్ షేక్ గత కొంతకాలంగా నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం నకిలీ నోట్లను చలామణి చేస్తుండగా పోలీసులు, అతడ్ని పట్టుకున్నట్లు తెలిపారు. రూ. 6లక్షల విలువ చేసే వెయ్యి రూపాయల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను చలామణి చేస్తున్న కేసులో కొద్ది రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 5లక్షల విలువ చేసే నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.