నారాయణ మూర్తి ‘బ్లూవేల్’ ఆడించారా?: సిక్కా ఏమన్నారంటే..?
భారత ఐటీ దిగ్గజాలలో ఒకటైన ఇన్ఫోసిస్లో గత కొంతకాలంగా సంచల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ పదవి నుంచి విశాల్ సిక్కా తప్పుకోవడం కలకలం రేపుతోంది.
బెంగళూరు: భారత ఐటీ దిగ్గజాలలో ఒకటైన ఇన్ఫోసిస్లో గత కొంతకాలంగా సంచల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ పదవి నుంచి విశాల్ సిక్కా తప్పుకోవడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం తాత్కాలిక సీఈవోగా ప్రవీణ్ రావ్ను నియమించారు. ఈ నేపథ్యంలో తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనేదానిపై సిక్కా తన బ్లాగులో వివరించారు.
ఆరోపణలు..
ఇటీవల నిరాధారమైన ఆరోపణలతో తనపై వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయని.. ఇలాంటి సమయంలో సీఈవోగా తాను కొనసాగలేనని సిక్కా అందులో పేర్కొన్నారు. అంతేగాక భవిష్యత్తులో ముందుకెళ్లేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన రాజీనామాకు గల కారణాలను ‘మూవింగ్ ఆన్' పేరుతో సిక్కా తన బ్లాగులో పేర్కొన్నారు.
అందుకే ఈ నిర్ణయం తప్పలేదు..
‘ఎంతో ఆలోచించిన తర్వాత నేను సీఈవో, ఎండీ పదవికి రాజీనామా చేశాను. గడిచిన మూడేళ్లలో ఎంతో సాధించాం. కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాం. అయితే గత కొన్ని రోజులుగా నాపై వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయి. అవన్నీ నిరాధారమే. అయితే ఆరోపణలతో నేను సీఈవోగా కొనసాగలేను. అందుకే రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను' అని సిక్కా స్పష్టం చేశారు.
స్టీవ్ జాబ్స్ చెప్పినట్లు.. కొత్త సవాళ్లు..
‘స్టీవ్ జాబ్స్ చెప్పినట్లు.. నేను నా మనస్సును, నా కలలనే ఫాలో అవుతాను. ఇప్పుడు నేను ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఎక్కడైతే మర్యాదపూర్వకమైన, నమ్మకమైన వాతావరణం ఉంటుందో అక్కడికి తిరిగి వెళ్తున్నాను. అక్కడ కొత్త సవాళ్లను స్వీకరిస్తాను' అని విశాల్ సిక్కా తన మనసులోని మాట తెలిపారు.
బాధపడలేదు.. ధైర్యంగా ముందుకెళ్తా..
అంతేగాక, ‘నా ప్రియమైన కుటుంబసభ్యులతోనూ నేను సమయం గడపాలనుకుంటున్నాను. చాలా కాలంగా నేను నా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ మూడేళ్ల కాలంలో ఎప్పుడైనా బాధపడ్డారా అని నన్ను చాలా మంది అడిగారు. దానికి ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. ఒక్క క్షణం కూడా నేను బాధపడలేదు. సమస్యలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్లాను. ఇన్నాళ్ల పాటు నాకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు' అని సిక్కా బ్లాగులో రాశారు.
బ్లూవేల్ ఆడించారా?
అయితే సిక్కా వైదొలగడానికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తినే కారణమని అటు బోర్డు వర్గాలు, ఇటు కార్పొరేట్ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిక్కాతో నారాయణమూర్తి బ్లూవేల్ గేమ్ ఆడించారని, ఆయన పదవి నుంచి బలవంతంగా తప్పుకునేలా చేశారని.. అయితే ఇది తమ సొంత అభిప్రాయం మాత్రమేనని కార్పొరేట్ విశ్లేషకులు చెబుతున్నారు.
మెయిల్లో నారాయణ మూర్తి ఇలా..
అయితే ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి.. విశాల్సిక్కా సీఈవోగా పనికిరారని ఓ ఈమెయిల్లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సీఈవో కంటే సీటీవో పదవే విశాల్సిక్కాకు సరిపోతుందని బోర్డులోని పలువురు స్వతంత్ర డైరెక్టర్లు తనతో అన్నట్లు నారాయణమూర్తి ఆగస్టు 9న ఓ ఈమెయిల్లో పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, దీని అనంతరం నారాయణమూర్తి మరో ఈ మెయిల్ రాశారు. ‘విశాల్ సిక్కాపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయనతో సమయాన్ని గడపడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన పనితీరుపై నేను ఎప్పుడు వ్యాఖ్యానించలేదు. ఇన్ఫోసిస్ పాలనపైనే నా బాధ అంతా. ప్రస్తుత బోర్డులో లోపాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను.' అని మూర్తి మరో మెయిల్లో పేర్కొనడం గమనార్హం. కాగా, తనపై నారాయణమూర్తి చేసిన ఆరోపణల కారణంగానే సిక్కా వైదొలిగినట్లు ఇన్ఫోసిస్ వర్గాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం.
విభేదాలు
ఇటీవల ఇన్ఫీ వ్యవస్థాపకులు, సంస్థ మేనేజ్మెంట్ మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయి. బోర్డు పాలనలో లోపాలున్నాయని మూర్తి పదేపదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాక, ఉన్నతస్థాయి ఉద్యోగుల జీతాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సిక్కాతో అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. సిక్కా రాజీనామాతో ఇన్ఫోసిస్ సీవోవోగా పనిచేస్తున్న ప్రవీణ్ రావ్ను తాత్కాలిక సీఈవో, ఎండీగా నియమించారు. కాగా.. సిక్కాను ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా నియమించినట్లు కంపెనీ వెల్లడించింది. త్వరలోనే కొత్త సీఈవోను బోర్డు ఎన్నుకోనున్నట్లు తెలిపింది. కాగా, సిక్కా ఇన్ఫోసిస్లో చేరేముందు జర్మనీకి చెందిన మల్టినేషనల్ సాఫ్ట్వేర్ కార్పొరేషన్ ఎస్ఏపీ ఏజీలో ఎగ్జిక్యూటివ్ బోర్డ్, గ్లోబల్ మేనేజింగ్ బోర్డ్ మెంబర్గా కొనసాగారు.
మూర్తి తీవ్ర స్పందన
రాజీనామా చేస్తూ విశాల్ సిక్కా చేసిన ఆరోపణలపై కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఘాటుగా స్పందించారు. విశాల్ సిక్కా చేసిన నిరాధారహైన ఆరోపణలపై స్పందిస్తే తన గౌరవానికి భంగమంటూ తీవ్రంగా స్పందించారు. ఇన్ఫోసిస్ బోర్డు రాసిన ప్రకటనంతటిన్నీ చదివినట్లు తెలిపిన మూర్తి.. ఆ ఆరోపణలు చాలా బాధాకరమని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక, సరైన సమయంలో తగిన సమాధానమిస్తానంటూ మూర్తి చెప్పారు. 2014లో తానే స్వయంగా బోర్డు నుంచి తప్పుకున్నానని, కనీసం నగదు కూడా కోరలేదని చెప్పారు. తన పిల్లల కోసం ఇన్ఫీలో కనీసం ఎలాంటి అధికారాలను, స్థానాలను అడుగలేదని కూడా మూర్తి వివరించారు.