లోదుస్తులతో వచ్చారు: కట్టేసి కొట్టి ఇద్దరి హత్య, ఇద్దరిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: నలుగురైదుగురు దోపిడీదారులు రెండు ఇళ్లలో బీభత్సం సృష్టించారు. మూడు గంటల పాటు అతి దుర్మార్గంగా వ్యవహరించారు. బుధవారం అర్ధరాత్రివేళ ఇంటి ప్రాంగణంలోకి చొరబడ్డారు. ఆరుబయట నిద్రిస్తున్న ఆ ఇంటివారిని బాలిక చున్నీతో కట్టేసి ఇనపరాడ్లతో దారుణంగా కొట్టారు.
ఆ దెబ్బలతో ఒక జంట మరణించింది. ఇదంతా జరుగుతుండగానే ముగ్గురు దుండగులు ఇంట్లోకి వెళ్లి ఒక వివాహితపైనా, పదహారేళ్ల బాలికపైనా సామూహిక అత్యాచారం చేశారు. హర్యానాలోని మేవాట్ జిల్లాలో గల దింగర్హెరి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార బాధితుల్లో ఓ మహిళ వివాహితురాలు కాగా, మరో బాధితురాలు మైనగర్ బాలిక.
దారుణానికి పాల్పడిన దుండగులంతా లోదుస్తులు మాత్రమే ధరించి ఉన్నారని, ఒంటికి నూనె పూసుకుని ఉన్నారని, వారిలో ఒకరి వద్ద నాటు తుపాకీ ఉందని అత్యాచార బాధితుల్లో ఒకరు చెప్పారు. ఇల్లంతా వెతికి విలువైన వస్తువులను, రెండు మోటార్సైకిళ్లను ఎత్తుకుపోయారని తెలిపారు.
కచ్చాగ్యాంగ్ దుండగులే ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్న కుటుంబసభ్యుడొకరు ఊళ్లోకి వెళ్లి గ్రామస్థులకు విషయం తెలిపారు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజాము సమయానికి ఆ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి అత్యాచార బాధితులిద్దరూ తలకు గాయాలతో మంచంవద్ద పడి ఉన్నారు.
మరో ఐదుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు.