అయ్యో! 'ఫ్లూటో' తునాతునకలైంది...
సీఆర్పీఎఫ్ 229 వ బెటాలియన్ కు చెందిన స్నిఫర్ డాగ్ 'ఫ్లూటో' నక్సల్స్ అమర్చిన మందుపాతరపై పొరపాటున కాలేసి, తునాతునకలైంది.
రాయపూర్: అడవుల్లో నక్సలైట్ల కోసం జరిగే కూంబింగ్ ఆపరేషన్లలో చురుకుగా వ్యవహరించి, పలు జాతీయ అవార్డులు సైతం సొంతం చేసుకున్న స్నిఫర్ డాగ్ 'ఫ్లూటో' అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది.
సీఆర్పీఎఫ్ 229 వ బెటాలియన్ కు చెందిన ఈ శునకం నక్సల్స్ అమర్చిన మందుపాతరపై పొరపాటున కాలేసి, తునాతునకలైంది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ అడవుల్లో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.
స్నిఫర్ డాగ్ ఫ్లూటోను వెంటబెట్టుకొని సీఆర్పీఎఫ్ జవాన్లు కొందరు.. సోమవారం రాత్రి తిమ్మాపూర్-ముర్దాండల మధ్యనున్న అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అర్ధరాత్రి తర్వాత నక్సల్స్ కోసం కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు.
మంగళవారం ఉదయానికి సీఆర్పీఎఫ్ బృందం ముర్దాండ సమీపానికి చేరుకుంది. జవాన్ల కంటే ముందుగా నడుస్తూ వెళ్ళిన ఫ్లూటో.. దారి మధ్యలో నక్సల్స్ అమర్చిన మందుపాతరను గుర్తించి అరవసాగింది. ఈ క్రమంలో పొరపాటున దాని కాలు మండుపాతరపై పడడంతో పేలుడు సంభవించింది.
అయితే, ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఫ్లూటో మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన వారు దాని మరణం తమ బెటాలియన్ కు తీరని నష్టమని పేర్కొన్నారు. ఫ్లూటో విన్యాసాలకు సంబంధించిన ఫోటోలను సీఆర్పీఎఫ్ అధికారిక ట్విటర్ పేజీలో షేర్ చేశారు.