ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తే లేదు,పెద్ద నగదు నోట్ల రద్దు ఇద్దరిదీ ఒకే మాట
బి.జెపితో చేతులు కలిపే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. అయితే ఈ నిర్ణయాన్ని సమర్థించినంత మాత్రానా బిజెపికి దగ్గరైనట్టు కాదన
పాట్నా : బిజెపితో చేతులు కలిపే ప్రసక్తే ఉండబోదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆయన ప్రశంసిస్తూ ఇటీవల ప్రకటనలు చేయడంతో ఆయన బిజెపికి దగ్గరౌతారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాను మహాకూటమితోనే ఉంటానని ఆయన విస్పష్టం చేశారు.
ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్, ఆర్ జె డి తో కలిసి ఫ్రంట్ గా జతకట్టిన ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించింది.అయితే నితీష్ కుమార్ వ్యూహాం ఫలించింది.ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయదుంధుబి మోగించింది. మరోసారి నితీష్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆర్ జెడి కూడ ప్రయోజనం పొందింది.
బిజెపికి దూరం వెనుక
2019 ఎన్నికలకు ముందుగానే బిజెపి పార్లమెంటరీ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించింది.మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన బిజెపికి దూరమయ్యారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బిజెపిని వదిలి ఆర్ జె డి ,కాంగ్రెస్ పార్టీతో కలిసి బీహార్ ఎన్నికల్లో మహాకూటమిని ఏర్పాటుచేసి విజయం సాధించారు. ప్రధానమంత్రి కావాలనే కోరిక నితీష్ కుమార్ కు బలంగా ఉంది.2019 ఎన్నికలకు ముందు బిజెపి నరేంద్రమోడీని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన మూడో ప్రంట్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అయితే మూడో ఫ్రంట్ ఏర్పాటు మాత్రం సాధ్యం కాలేదు. దీంతో ఆయన బీహార్ లో మాత్రం ఇతర పార్టీలను కలుపుకొని అధికారపీఠాన్ని దక్కించుకొన్నారు.మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది,. అందుకే బిజెపి కి వత్యరికేంగా ఐక్యంగా ఉండాలని 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన ఆ పార్టీతో పొత్తును తెగతెంపులు చేసుకొన్నారు. అయితే పదేళ్ళపాటు ఆ పార్టీతో ఆయన మిత్రత్వాన్ని కొనసాగించారు.
బద్దశత్రువుతో మితృత్వం
బీహార్ రాజకీయాల్లో కొంతకాలంగా ఆర్ జె డి పార్టీతో నితీష్ కుమార్ బద్దశత్రువుగా వ్యవహరించేవాడు. బీహార్ రాజకీయాలను శాసించిన లాలును దాణా కుంభకోణంలో అరెస్టు కావడంతో ఆ పార్టీ కొంత ఇబ్బందికి గురైంది. ఇదే సమయంలో నితీష్ పాలన , అభివృద్ది కార్యక్రమాల పట్ల ఆ రాష్ట్ర ప్రజలు మక్కువను చూపారు. కాని, బిజెపితో తెగతెంపులు చేసుకొన్న తర్వాత విపక్షాల ఓటు బ్యాంకు చీలిపోతే బిజెపి ప్రయోజనం కలిగే అవకాశం ఉందిన నితీష్ బావించారు అందుకే ఆయన తన బద్దశత్రువైన లాలూతో పొత్తుకుసిద్దమయ్యారు.
మూడో ఫ్రంట్ ప్రయోగం విఫలమై
2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం కొంత ప్రయత్నాలు జరిగాయి. అయితే పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలించలేదు. ప్రాంతీయ పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తాము అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మార్గాలను ఎంచుకొన్నాయి. చాలా కాలంపాటు బిజెపికి దూరంగా ఉంటూ వచ్చిన టిడిపి ఈ ఎన్నికల ముందుగానే ఆ పార్టీతో జతకట్టింది. ఈ పొత్తు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కలిసివచ్చింది. మూడో ఫ్రకంట్ ప్రయోగం సక్సెస్ అయితే ఆ ఫ్రంట్ అభ్యర్థిగా తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలని నితీష్ భావించాడు. అయితే ఈ ప్రయోగం సక్సెస్ కాలేదు. భవిష్యత్ లో కూడ ఆయన ప్రధానమంత్రిగా పనిచేయాలనే కోరిక బలంగా ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
పరస్పర విమర్శలు
బీహార్ ఎన్నికల సమయంలో బిజెపి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న నరేంద్రమోడీ నితీష్ కుమార్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎనికలకు ముందు కేంద్ర ప్రభుత్వం బీహార్ ప్యాకేజీని కూడ ప్రకటించింది.ఇవేవీ కూడ ఈ ఎన్నికల్లో బిజెపికి కలిసి రాలేదు. మహాకూటమికే బీహారీలు పట్టం కట్టారు. అయితే నితీష్ కూడ బిజెపి పై తన విమర్శలను తిప్పికొట్టారు.బిజెపిపై ఒంటికాలిపై విమర్శలు చేశారు.
పెద్ద నగదు నోట్లపై ఇద్దరిదీ ఒకేమాట
పెద్ద నగదు నోట్ల రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది . నల్లధనం మూలాల్ని వెలికితీసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమర్థించారు. ఈ నిర్ణయం వల్ల నల్లధనం లేకుండా పోయే అవకాశం ఉందని అయన ఈ నిర్ణయాన్ని సమర్థించారు. నేపాల్ నుండి భారత్ కు ఎక్కువగా నకిలీ కరెన్సీ వస్తోంది. ప్రధానంగా బీహార్ రాష్ట్రంలో ఈ నకిలీ కరెన్సీ చలామణి అవుతోంది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోందని నితీష్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు.ఈ నిర్ణయాన్ని సమర్థించిన మాత్రాన బిజెపితో చేతులు కలిపే ప్రసక్తే ఉండదని ఆయన చెబుతున్నారు.