అమల్లోకి పెట్రోల్, డీజిల్ డిజిటల్ చెల్లింపులపై డిస్కౌంట్
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్ పోయించుకునే వారికి 0.75 శాతం రాయితీ ఇస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ రాయితీ ప్రకటించింది.
డెబిట్, క్రెడిట్ కార్డుల, ఈ-వాలెట్లు లేదా మొబైల్ వాలెట్లు ద్వారా నగదు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. లీటరు పెట్రోల్ పై 49 పైసలు, లీటరు డీజిల్ పై 41 పైసలు రాయితీగా ఇస్తున్నారు. కార్డు ద్వారా చెల్లించిన మూడు రోజుల తర్వాత రాయితీ డబ్బులు వినియోగదారుడి ఖాతాలో పడతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 66.10, డీజిల్ ధర రూ.54.57గా ఉంది.
పాత పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు పూర్తైన సందర్భంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు డిసెంబర్ 8న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రోల్, డీజిల్ కొనుగోలుతోపాటు బీమా పాలసీలు, రైలు టికెట్లు, జాతీయ రహదారులపై టోలు ఛార్జీలు డిజిటల్ రూపంలో చెల్లిస్తే డిస్కౌంట్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది.