కామన్వెల్త్ స్కాం: 6గురు దోషులకు జైలు, జరిమానా
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం నాటి (2010) కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కేసులో ఆరుగురు దోషులకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. నలుగురు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారులు, ఓ ప్రైవేట్ సంస్థ డైరెక్టర్కు నాలుగేళ్లు, అదే సంస్థ ఎండీకి ఆరేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది.
ఈ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విధించిన తొలి జైలుశిక్ష ఇదే కావడం గమనార్హం. కామన్వెల్త్ క్రీడల సమయంలో విద్యుద్దీపాలతో ఢిల్లీ నగర వీధుల అలంకరణ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ను శ్వేక పవర్టెక్ సంస్థకు చట్టవిరుద్ధంగా అప్పగించడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.1.4 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ప్రాసిక్యూటర్ ప్రణీత్ శర్మ వాదించారు.
ఎంసీడీ సూపరింటెండెంట్ ఇంజినీర్ డీకే సుగన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓపీ మహ్లా, అక్కౌంటెంట్ వీ రాజు, ఎంసీడీ టెండర్ క్లర్క్ గురుచరణ్ సింగ్, శ్వేక పవర్టెక్ సంస్థ డైరెక్టర్ జేపీ సింగ్లకు నాలుగేళ్ల కఠిన కరాగార శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బ్రిజేశ్ గార్గ్ తీర్పు చెప్పారు.
శ్వేక పవర్టెక్ ఎండీ టీపీ సింగ్కు ఆరేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో నిందితులపై మోపిన అభియోగాలు రుజువయ్యాయన్నారు. వారంతా కలిసే టెండర్ పత్రాలపై ఫోర్జరీ సంతకాలు చేశారని పేర్కొన్నారు. న్యాయమూర్తి తీర్పు చెప్తున్న సమయంలో దోషులంతా కోర్టులోనే ఉన్నారు.
వీరు అవినీతి నిరోధక చట్టం ఉల్లంఘించడంతోపాటు ఐపీసీలోని 13 (1)(డీ) సెక్షన్ ప్రకారం నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ తదితర నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. శ్వేక పవర్ టెక్ సంస్థకు రూ.70 వేలు, నలుగురు ఎంసీడీ అధికారులపై రూ.30 వేల చొప్పున, టీపీసింగ్కు రూ.42 వేలు, జేపీ సింగ్లపై రూ.22 వేల జరిమానా కూడా విధించారు.
కాగా, ‘ఈ కేసులో దోషులకు వ్యతిరేకంగా రుజువైన ఆరోపణలన్నీ కూడా సామాన్యమైనవి కావు. అత్యంత తీవ్రమైనవి. దోషులంతా ఒక్కటై కుట్రకు పాల్పడ్డారు. టెండరు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారు. తద్వారా ఎంసీడీ/జీఎన్సీటీడీలను నిలువునా ముంచేశారు. టెండర్ ఓపెనింగ్ రిజిస్టరు విషయంలో సైతం ఫోర్జరీకి పాల్పడ్డారు' అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, తాము ఇప్పటికే జైలుశిక్ష అనుభవించినందున తమను విదుదల చేయాలని శ్వేక పవర్టెక్కు చెందిన టీపీసీంగ్, జేపీ సింగ్ కోరారు. ఈ కుంభకోణం వల్ల నష్టపోయింది తామేనని, ఎంసీడీ కాదని వాదించారు.
కాగా, ఈ కుంభకోణంపై సీబీఐ 2011లో చార్జిషీట్ దాఖలు చేసింది. ఫిలిప్స్ ఇండియా ఉద్యోగి మెహుల్ కార్నిక్ పేరు కూడా చార్జిషీట్లో పేర్కొన్నా.. తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు.