తమిళనాడును వణికిస్తున్న ‘నాడా’ తుఫాను: తెలుగు రాష్ట్రాలకు వర్షాలు
తమిళనాడు రాష్ట్రంలోని తీరప్రాంతం నాడా తుఫాను ప్రభావంతో వణికిపోతోంది.
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని తీరప్రాంతం నాడా తుఫాను ప్రభావంతో వణికిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఏ విధమైన ప్రభావం చూపిస్తుందోనని ఆందోళన చెందుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లలేదు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందడంతో కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఆయా కోస్తా జిల్లాల మత్స్యశాఖ అధికారులు సైతం ఈ హెచ్చరికలు జారీ చేశారు.
బుధవారం ఉదయం పలు జిల్లాల్లోని మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లలేదు. నాటు పడవలు, మరపడవలు సముద్రతీరంలో, ఫిషింగ్ హార్బరులో నిలిచిపోయాయి. చెన్నైలోని మత్స్యకార గ్రామాలకు చెందిన కొందరు మాత్రం ఫైబర్ బోట్లతో సముద్రంలోకి వెళ్లారని, వీరు ఎక్కువ దూరం సముద్రం లోపలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని చేపలు పట్టుకుంటారని మత్స్యశాఖ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
పుదుకోట్టె జిల్లాలో కృష్ణాచ్చిపట్టినం, కోడియకరై, పుదుకుడి, అయ్యంపట్టినం, ముత్తుకుడ, ఆర్.పుదుపట్టినం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 1,500 నాటు పడవలు, 650 మరపడవలకు చెందిన సుమారు 20 వేల మంది మత్స్యకారులు బుధవారం సముద్రంలోకి వెళ్లలేదు.
పాఠశాలలు బంద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తుపాను భయం పొంచి ఉన్న చెన్నై సహా ఐదు జిల్లాల్లోని పాఠశాలకు రెండ్రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. శుక్రవారం తమిళనాడు, పుదుచ్చేరి మధ్యలో తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
'నాడా' తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కనిపించనుంది. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను భయంతో ఏపీ పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
బలహీనపడిన నాడా
బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'నాడా' తుపాను బలహీనపడింది. ఇది ప్రస్తుతం చెన్నైకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం కడలూరు వద్ద తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నై సహా తమిళనాడు తీర ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. మరోవైపు తమిళనాడుపై తుపాను ప్రభావం నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయి. ప్రజల సౌకర్యార్థం తమిళనాడు ప్రభుత్వం 1070, 1077 టోల్ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది.